ఢిల్లీ కొలువులో నేర‘గణులే’

by  |
ఢిల్లీ కొలువులో నేర‘గణులే’
X

అంగ బలం.. ఆర్థిక అండదండలు.. ఇవే రాజకీయ పార్టీలకు అభ్యర్థుల ఎంపికలో అజెండాలు అవుతున్నాయి. కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే.. ఎంత తీవ్రమైన నేరం చేస్తే అంత మంచిదన్నట్లు తయారైంది పరిస్థితి. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆమ్ అద్మీ పార్టీ 62, బీజేపీ 8 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు. అయితే, గెలిచిన అభ్యర్థుల్లో ఈసారి మూడింట రెండొంతుల మంది నేరచరితులే. ఇందులో చిన్నపాటి నేరంతో మొదలుకుని అత్యాచారయత్నం, హత్యాయత్నం తదితర తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది దోషులుగా కూడా తేలారు. ఒకరు హత్యాయత్నం కేసులో దోషిగా నిర్ధారణ అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ పేర్కొంది. 37 మంది ఎమ్మెల్యేలపై అత్యాచారం, హత్యాయత్నం తదితర తీవ్ర నేర చరిత్ర ఉన్నట్లు తెలిపింది. నామినేషన్ల సమయంలో ఎన్నికల అఫిడవిట్లలో 43 మంది అభ్యర్థులు తమకు నేర చరిత్ర ఉన్నట్లు ప్రకటించుకున్నారు. 2015లో ఈ సంఖ్య 24గా ఉంది. ఈసారి నేరచరితుల సంఖ్య దాదాపు రెట్టింపునకు చేరుకుంది.

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ అద్మీ పార్టీ… అదేస్థాయిలో నేర చరిత్ర కలిగిన 38 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించింది. ఆ పార్టీ నుంచి 62 మంది అభ్యర్థులు విజయం సాధిస్తే.. సగం కంటే ఎక్కువ మంది నేర చరితులే కావడం గమనార్హం. మరోవైపు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఐదుగురు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఆప్‌ ఎమ్మెల్యేలు 33 మంది, బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఇరు పార్టీల నుంచి గెలుపొందిన వారిలో సగం కంటే ఎక్కువ మంది నేరచరితులే కావడం గమనార్హం.

పేరుకు పేదల పార్టీ అయిన ఆప్.. కోటీశ్వరులకే అత్యధిక సీట్లను కేటాయించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 62 మంది ఎమ్మెల్యేల్లో 45 మంది కోటీశ్వరులు కాగా, మిగిలిన వారు రూ. 10 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉన్నవారే. ఒక్కరంటే ఒక్కరు కూడా పేదలు లేరు. ఇందుకు బీజేపీ సైతం మినహాయింపు కాదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు మినహా అందరూ కోటీశ్వరులే. 2015 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 44 మంది (63 శాతం) కోటీశ్వరులు గా, ఈసారి అది 52 (74 శాతం)కు పెరిగింది.


Next Story

Most Viewed