ఏపీ నుంచి తరలిపోతున్న ప్రపంచ స్థాయి కంపెనీ

by  |
Amara raja
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అమరరాజా. ఈ కంపెనీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. చిత్తూరు జిల్లాను పారిశ్రామికంగా ప్రపంచం దృష్టిలో పడేలా చేసిందంటే అందుకు అమరరాజా కంపెనీయే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న “అమరాన్” బ్యాటరీలను అమరరాజా సంస్థ ఉత్పత్తి చేస్తుంది.

అమెరికాలో స్థిరపడిన గల్లా రామచంద్రనాయుడు తన సొంతూరుకు చెందిన ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చిత్తూరులో అమరరాజాను స్థాపించారు. బ్యాటరీ సెక్టార్‌లో దేశంలోనే అమరరాజా నెంబర్ 2స్థానంలో కొనసాగుతుంది. 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉంది. పన్నుల రూపంలో అమరరాజా కంపెనీ ప్రతి సంవత్సరం రూ.2400 కోట్లు చెల్లిస్తోంది. అమరరాజా చెల్లించే పన్నులలో ఏపీ వాటా రూ.1200 కోట్లుగా ఉందంటే కంపెనీని ఎంత బలోపేతం చేశారో తెలుస్తోంది. అంతేకాదు ఈ కంపెనీని మరింత విస్తరించాలని యాజమాన్యం ప్రయత్నించింది. చిత్తూరు జిల్లాలోనే మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో కొత్త ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించాలని యాజమాన్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే కన్నా తరలిపోవడం మంచిదని ఆ సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ కంపెనీపై దాడులు చేస్తోందని జయదేవ్ ఆరోపిస్తున్నట్లు సమాచారం. అదనపు ప్లాంట్ కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకోవడం.. రెండు యూనిట్లు మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఇవ్వడం… విద్యుత్ సరఫరా సైతం నిలిపివేయాలని ఆదేశించడం వంటి పరిణామాల నేపథ్యంలో యూనిట్‌ను తమిళనాడుకు తరలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో అమరరాజా కంపెనీ చైర్మన్, ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కంపెనీ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ఘన స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. భూముల పరిశీలన కూడా జరిగిందని రాబోయే 3 నెలల్లో కంపెనీ తమిళనాడుకు తరలిపోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed