మంత్రాల నెపంతో మహిళ హత్య

by  |
మంత్రాల నెపంతో మహిళ హత్య
X

దిశ, మునుగోడు: మంత్రాలు చేసి తన తమ్మున్ని చంపిందనే నెపంతో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండల పరిధిలోని రాచకొండలో వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే.. నారాయణపురం గ్రామపంచాయతీ గాంధీనగర్ తండాకు చెందిన మెగావత్ నరసింహ తమ్ముడు గత నెల విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. అయితే తన తమ్మునికి అదే గ్రామానికి చెందిన నేనావత్ బుజ్జి(46) అనే మహిళ మంత్రాలు చేసి చంపిందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా బుజ్జిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆమె మరో వ్యక్తితో బైక్‌మీద నారాయణపురం గ్రామానికి వస్తుండగా.. ముగ్గురితో కలిసి మాటువేసి ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. రాచకొండ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమె మెడకు చీర బిగించి చంపేశారు. హత్య అనంతరం నిందితుడు నరసింహ నేరుగా నారాయణపురం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న బుజ్జి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితున్ని అప్పగించేవరకూ మృతదేహాన్ని కదిలించవద్దంటూ భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటయ్య బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సముదాయించారు. జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నామని నారాయణపురం ఎస్ఐ నాగరాజు తెలిపారు.



Next Story

Most Viewed