టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కుటుంబాన్ని వేధిస్తున్నారని హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే భాస్కరరావు వేధిస్తున్నారని మణెమ్మ అనే మహిళ ఆరోపించారు. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారని.. వారికి ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

తన భర్త లాయర్‌గా పనిచేస్తున్నాడని.. ఎమ్మెల్యే బాధితుల తరపున కేసులు వాదిస్తున్నాడని.. మణెమ్మ తెలిపారు. ఐతే బాధితులకు అండగా ఉన్నందుకు తన భర్తపై కక్షగట్టి.. అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. భాస్కర్ రావు అక్రమాలను ప్రశ్నించినందుకు తన భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మణేమ్మ హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. కాగా తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే భాస్కరరావు ఖండించినట్టు సమాచారం. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. రాజకీయ ప్రత్యర్థులే తనపై కుట్ర చేస్తున్నారని విమర్శించినట్టు తెలిసింది.


Next Story