ప్రభుత్వ ఆస్పత్రిలో అమానుషం.. బాత్రూంలో ప్రసవించిన మహిళ

by  |
hospital
X

దిశ, ఏపీ బ్యూరో : అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వెళ్లిన గర్భిణీ పట్ల వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహించారు. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను అక్కున చేర్చుకోవాల్సిందిపోయి.. డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ లేరని చెప్పి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వారిని ఇబ్బందులకు గురి చేశారు. దీంతో బాధిత గర్భిణీ బాత్‌రూమ్‌లో ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే రాయదుర్గం సమీప ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే మహిళకు నెలలు నిండాయి. అయితే పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు లక్ష్మిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న నర్సులు ఆమెను పరీక్షించారు. కాన్పు కష్టంగా ఉందని.. వేరే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

ఇంతలో గర్భిణీ లక్ష్మి బాత్‌రూమ్‌కు వెళ్లింది. అక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఇతర వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రధాన వైద్యాధికారి మంజువాణికి గర్భిణీ బంధువులు ఫిర్యాదు చేశారు. కాన్పు కష్టమని నర్సులు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్యూటీ డాక్టర్ ఆస్పత్రిలోనే ఉన్నప్పటికీ వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాన్పు కోసం వచ్చిన లక్ష్మికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటనపై ప్రధాన వైద్యాధికారి మంజువాణి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Next Story