ఆయన ఒలింపిక్ హా‘కీ’ప్లేయర్

by  |
ఆయన ఒలింపిక్ హా‘కీ’ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్: మనకు నిన్న, మొన్న జరిగిన విషయాలే సరిగా గుర్తుండవు. అలాంటిది ఎప్పుడో 70 ఏండ్ల ముందు జరిగిన అద్భుతాలు తెలుస్తాయని ఎవరనుకుంటారు. కానీ, చరిత్ర సృష్టించిన, తిరగరాసిన వీరుల విషయాలు మదిలో మెదులుతూనే ఉంటాయి. అటువంటి ఓ క్రీడాకారుడు ఇవాళ పరమపదించాడు. ఆయన ఎవరో కాదు.. హాకీ దిగ్గజం, ఒలింపిక్ స్వర్ణ పతకం విజేత బల్బీర్ సింగ్. ఎంతో మంది క్రీడాకారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు ఆయన గురించి స్మరించుకున్నారు. కానీ, చాలా మందికి బల్బీర్ ఘనత, ఆయన ఎవరో కూడా తెలియకపోవచ్చు. అందుకే ఆయన జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఒక మ్యాచ్ గురించి తెలుసుకుందాం.

భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే బ్రిటన్ రాజధాని లండన్‌లో ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ఇండియాకు స్వతంత్రం రాక ముందు నుంచే ఇండియా ఎలెవెన్ పేరుతో హాకీ జట్టు ఒలింపిక్ క్రీడలు ఆడేది. 1928లో అమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఒలింపిక్స్ నుంచి ఇండియా ఎలెవెన్ హాకీ ఆడుతుండటంతో.. బ్రిటన్ తన హాకీ జట్టును ఒలింపిక్ క్రీడల నుంచే విరమించకుంది. తమ బానిస రాజ్యం జట్టు ఆడుతున్నప్పుడు మా జట్టు ఎందుకు ఆడాలని భావించడంతో బ్రిటన్ హాకీ జట్టు అసలు ఒలింపిక్స్ మానేసింది. అయితే 1947లో ఇండియాకు స్వతంత్రం వచ్చాక.. 1948లో లండన్‌లో క్రీడలు జరిగాయి. అప్పడు ఇండియా జట్టు అధికారికంగా ఒక దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ బరిలోకి దిగింది. అప్పటి వరకు హాకీ జట్టును బరిలోకి దించని బ్రిటన్.. తప్పని సరి పరిస్థితుల్లో జట్టును మైదానంలో దింపింది. అయితే ఆ ఒలింపిక్స్ ఫైనల్స్ బ్రిటన్, ఇండియా జట్ల మధ్యే జరగడం విశేషం. అయితే, ఇండియా జట్టు ఫైనల్స్ చేరడానికి కారణం బల్బీర్ సింగ్.

బ్రిటన్ జట్టు ఆ ఫైనల్ మ్యాచ్ ఎలాగైనా రద్దు కావాలని కోరుకుంది. అప్పటికే ఫైనల్స్ జరగాల్సిన వింబ్లే స్టేడియం వద్ద జోరుగా వర్షం కురుస్తోంది. అయితే, ఆ ఒలింపిక్స్ అంతా ఎలాంటి బూట్లు ధరించకుండా ఉత్తి కాళ్లతోనే భారత జట్టు మ్యాచ్‌లు ఆడింది. మ్యాచ్‌కు ముందు బల్బీర్ మాట్లాడుతూ.. మా లక్ష్యం ఏంటో మాకు తెలుసు.. కానీ బ్రిటన్ జట్టును మేం ఆశ్చర్యపరుస్తాం అని చెప్పాడు. బ్రిటన్ జట్టు కూడా ఆ ఆశ్చర్యం ఏంటో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంది. తీరా ఫైనల్స్ రోజు భారత జట్టు బూట్లు ధరించి ఫీల్డ్‌లోకి దిగింది. వర్షం పడి చిత్తడిగా మారిన గ్రౌండ్‌లో బ్రిటన్‌ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ఇదంతా బల్బీర్ ప్రణాళికే అంటా. ఈ ఒక్క మ్యాచ్ చాలు బల్బీర్ ఎలా ప్రణాళికలు రచిస్తాడో అని ఆనాటి హాకీ ప్లేయర్లు చెప్పుకునేవాళ్లు.

పంజాబ్‌లోని హరిపుర్ ఖాల్సాలో 1923 డిసెంబర్ 31న బల్బీర్ సింగ్ జన్మించాడు. హాకీ మీద ఉన్న ఆసక్తి అతడిని ఒలింపిక్స్ వైపు నడిపింది. ఈ నేపథ్యంలోనే 1948 ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బల్బీర్.. 1952 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినా తొలి మ్యాచ్‌లో గాయపడటంతో జట్టు నుంచి వైదొలిగారు. ఒలింపిక్స్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన బల్బీర్.. మొత్తం 22 గోల్స్ చేసి రికార్డు సృష్టించారు. ఆయన 1982లో బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది సెంచరీ అవార్డును గెలుచుకున్నారు. అలాగే హాకీలో అత్యున్నత అవార్డుగా భావించే మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు 2015లో అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న తొలి హాకీ ప్లేయర్ కూడా బల్బీర్ సింగ్ కావడం గమనార్హం. ఆయన తన హాకీ కెరీర్‌ను ‘ది గోల్డెన్ హ్యాట్రిక్ : మై హాకీ డేస్’ అనే పుస్తక రూపంలో తెచ్చారు. అయితే, గత కొంతకాలంగా మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బల్బీర్ సింగ్.. పంజాబ్ మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Next Story

Most Viewed