బీజేపీలో ముస్లీం అభ్యర్థి

by  |
బీజేపీలో ముస్లీం అభ్యర్థి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంటేనే ముస్లీం వ్యతిరేక పార్టీగా ప్రచారంలో ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్భమొచ్చినపుడల్లా ముస్లీం మత వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు. గతేడాది కేంద్రంలో బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం తర్వాత బీజేపీకి ముస్లీంలపై ఉన్న వ్యతిరేకతపై స్పష్టత వచ్చింది. కానీ రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడూ అలా ఉండరు. ముఖ్యంగా హైదరాబాద్ బీజేపీ నాయకులు అని చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ ప్రకటించిన కార్పొరేటర్ అభ్యర్థుల్లో ఒక ముస్లీం కూడా ఉండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డబీర్‌పురా వార్డు నుంచి బరిలో నిలుస్తున్న మీర్జా అకిల్ అఫాండి గ్రేటర్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా ఉన్నాడు.

అతడికి స్వయంగా బీజేపీ నుంచి భీ-ఫారం ఇచ్చి బరిలోకి దింపడం గమనార్హం.. ముస్లింల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఓల్డ్ సిటీలోని ఓ డివిజన్ నుంచి ఈయన పోటీలో నిలుస్తున్నారు. దుబ్బాక విజయోత్సాహంలో ఉన్న బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్ర నాయకులతో తరచుగా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తుండగా.. బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అవతరించింది. పాతబస్తీ అంటేనే ఎంఐఎంకు ప్రత్యేక కోటా.. టీఆర్ఎస్‌, ఎంఐఎంల మధ్య దోస్తీ బహిరంగ రహస్యమే.. ఈ సందర్బంలో బీజేపీ ప్రభావాన్ని చాటుకునేందుకు ముస్లీం అభ్యర్థిని రంగంలోకి దించుతోంది. ఈ స్థానంలో ఎంఐఎంకు పోటీగా ముస్లీం అభ్యర్థిని రంగంలోకి దించడం వల్ల ఇతర పార్టీల ఓట్లను చీల్చడం కూడా సాధ్యమవుతుంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నందున ముస్లీమేతర ఓట్లను కూడడా రాబట్టుకోవడం సులభమనే వ్యూహంతో బీజేపీ రంగంలోకి దిగుతున్నట్టు కనిపిస్తోంది.


Next Story