మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో రాడ్లతో కొట్టి చంపారు

by  |
Murder11
X

దిశ, నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫతేనగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని స్థానికులు హత్య చేశారు. నార్త్ రూరల్ సీఐ గురునాథం వివరాల ప్రకారం.. ఈనెల 2వ తేదీన గ్రామంలో శివారులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, ఎవరూ రాకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది చేత అంత్యక్రియలు నిర్వహించారు.

ఆ తర్వాత ఈనెల 8వ తేదీన బోధన్ పీఎస్‌లో తమ తండ్రి కనబడటం లేదని మృతుడు గంగాధర్(75) కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న గంగాధర్ 1వ తేదీన ఇంటి నుండి తప్పిపోయి రెంజల్ మండలం కిసాన్ తాండ వద్ద అర్ధరాత్రి శరీరానికి బూడిద పూసుకుని తిరుగుతున్నారు. అక్కడే ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండటానికి వచ్చిన గ్రామస్తులు రాథోడ్ రాజు, జీవన్, విక్రమ్ మంత్రగాడు అనే అనుమానంతో కర్రలు, ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. వారిని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. శుక్రవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ యాకుబ్ పాల్గొన్నారు.



Next Story