కడచూపునకు నోచుకోలేదు.. కన్నబిడ్డను చూడలేదు

by  |
కడచూపునకు నోచుకోలేదు.. కన్నబిడ్డను చూడలేదు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి, కరోనా మహమ్మారి బారిన పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సింగపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కడెం మండలం ఎలగడప గ్రామానికి చెందిన భూక్య నాయక్ అనే యువకుడు ఉపాధి కోసం సింగపూర్ వెళ్లారు. ఆయనకు రెండేండ్ల క్రితం వివాహం జరిగింది. భార్య గర్భిణిగా ఉండగానే భూక్యానాయక్ సింగపూర్ వెళ్ళారు. ప్రస్తుతం ఆయనకు 8 నెలల కొడుకు ఉన్నాడు. ఇటీవల ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా భూక్యా నాయక్ కరోనా బారిన పడ్డాడు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతేగాకుండా అంత్యక్రియలు కూడా అక్కడే ప్రభుత్వ సిబ్బంది సోమవారం నిర్వహించారు. దీంతో తమ కొడుకును కడ చూపు చూసుకోకుండా పోయిందని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే తన 8 నెలల కొడుకును వీడియో కాల్స్‌లో తప్ప… ఇప్పటివరకూ స్వయంగా చూడకుండానే మరణించాడని సమాచారం.

Next Story