ప్లాస్టిక్ కాగితాలే నీడగా బతికే అవ్వకు.. అండగా న్యాయ సేవా సంస్థ

by  |
ప్లాస్టిక్ కాగితాలే నీడగా బతికే అవ్వకు.. అండగా న్యాయ సేవా సంస్థ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చిత్తు కాగితాలు ఏరుకుని ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తూ అనారోగ్యానికి గురైన 60 ఏళ్ళ అవ్వకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అండగా నిలిచింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోదుగేగావ్ అనే గ్రామానికి చెందిన పోచవ్వ నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో గల ఫుట్ పాత్ పై జీవిస్తుంది. తన కొడుకు, కోడలు కాగితాలు ఏరుకుని వచ్చిన డబ్బుతో ముగ్గురు ఫుట్ పాత్ పై నే ప్లాస్టిక్ కాగితాలు నీడగా జీవిస్తుంది. ఇటీవల పోచవ్వ అనారోగ్యం కారణంగా అక్కడ ఒంటరిగానే జీవిస్తుంది. అనారోగ్యానికి గురైన పోశవ్వ నడవలేని స్థితిలో ఉండగా నగర నాల్గవ టౌన్ పోలీసులకు, స్థానిక స్వచ్చంద సంస్థ ప్రతినిధులు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్, సంస్థ సభ్యులు రాజ్ కుమార్ సుబేదార్, మాణిక్ రాజ్, ఆశా నారాయణ, ఇందూరు యువత సాయిబాబా, నాల్గవ టౌన్ ఎస్సై సందీప్ లను వెంట పెట్టుకుని పూలాంగ్ ప్రాంతంలోని నివసిస్తున్న పోచవ్వ వద్దకు వెళ్లారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సఖీ సెంటర్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అధికారులతో మాట్లాడి పోచవ్వకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్ మాట్లాడుతూ న్యాయసేవాసంస్థ కల్పించిన తోడు, నీడలో పోచవ్వ కోలుకుంటుందన్నారు. అనాధలుగా మిగిలిపోతున్న తరానికి న్యాయ సేవా సంస్థ, ప్రభుత్వ సంస్థలు, స్వచ్చంద సంస్థలు అండగా ఉంటాయన్నారు.



Next Story

Most Viewed