హైటెక్ వ్యక్తి.. గ్రామీణులకు టోకరా

by  |
హైటెక్ వ్యక్తి.. గ్రామీణులకు టోకరా
X

దిశ, మహబూబాబాద్ టౌన్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జేసీబీ,ట్రాక్టర్లను లీజుకు తీసుకొని నెల నెల డబ్బులు ఇస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదివారం మహబూబాబాద్ టౌన్, మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లలో వాహనాలు లీజుకు పెట్టుకుంటాను అని చెప్పి రూ.1.80కోట్లతో ఉడాయించిన వ్యక్తిపై బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకి చెందిన జి.నాగేంద్ర హైదరాబాద్‌లో కాంట్రాక్టర్లకు వాహనాలను లీజ్ కు ఇప్పిస్తుంటాడు. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 90మంది వద్ద జెసీబీ, ట్రాక్టర్‌లకు పని కల్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 2లక్షలకు పైనే లాక్కొన్నాడు.

ఉమ్మడి వరంగల్ నుంచి ముగ్గురికి చెప్పిన విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో బీ‌ఎస్‌సీ‌పీ‌ఎల్ కంపెనీ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని రెండు నెలలు లీజు అగ్రిమెంట్ ప్రకారం జేసీబీకి 2.2లక్షలు, ట్రాక్టర్‌కు 90వేలు ఇప్పించడంతో మిగతా వాహనదారులకు కూడా నమ్మకం అనిపించింది. దీంతో ముందుగా ట్రాక్టర్ అయితే 60వేలు జెసీబీ అయితే లక్ష రూపాయలు అడ్వాన్స్ కింద ఇస్తనే పని అవుతుందని నాగేంద్ర చెప్పడంతో బాధితులు డబ్బు రెడీ చేసి స్థానికంగా ఉన్న ఏజెంట్లకు ఇచ్చేవారు. అంతేకాకుండా వందరూపాయల బాండ్ పేపర్ పై మూడేళ్ల అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చేవారు. ఇలా 90 మందికి మూడునెలల క్రితం రాసి ఇచ్చాడు.

చాలా కాలమైనా వాహనాలను పనికి పిలవకపోవడంతో అందరు నాగేంద్రను నిలదీశారు. ఇదంతా డబ్బులు లాగడానికే నాగేంద్ర చేశాడని గమనించి నిలదీయగా కొంత మందికి తన కొటాక్ బ్యాంకు చెక్కు రాసి ఇచ్చాడు. బాధితులు ఆ చెక్కును అకౌంట్లో వేసుకోగా బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ అయిందని వాపోయారు. ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సోమవారం తాను నివాసం ఉండే హైదరాబాదులోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయుటకు బాధితులు వెళ్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని రమాదేవి తెలిపారు.


Next Story

Most Viewed