‘సర్వే’జనా… సుఖినోభవంతు ‘కరోనా’ !

by  |
‘సర్వే’జనా… సుఖినోభవంతు ‘కరోనా’ !
X

దిశ, వరంగల్: కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అనుకున్న విధంగా స్వీయ నియంత్రణను పాటిస్తున్నారు. ఎవరైనా కొత్తవారు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారమివ్వాలని ఆ జిల్లా వాసులు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అదెక్కడో మీరే చూడండి… ఈ ప్రత్యేక కథనంలో..

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అధికార యంత్రాంగం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ సర్వేను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మరణించగా పోస్ట్ మార్టమ్ నివేదికలో మృతుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. మృతుడితో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి తిరిగారని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ ఇద్దరి అనుమానితులను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి.. రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్ కు పంపారు. అయితే, వారికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వారు తిరిగిన ప్రాంతాల్లో వైద్యాధికారులు.. ఆశా వర్కర్ల చే ఇంటింటి సర్వే చేపట్టారు. అంతేగాకుండా విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. రోజురోజుకూ చోటు చేసుకుంటున్న పరిణామాలతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహమ్మారి నివారణకు చర్యలు..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి నివారణకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లాలవారీగా పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితులను చక్కబెడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన విదేశీయులపై నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలవారీగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనుమానితులను ఆ కేంద్రాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

ఇబ్బందులు కలగకుండా..

దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతర వస్తువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నారు. అంతేగాకుండా వలస కార్మికులు, కూలీలలకు భోజన వసతి కల్పిస్తూ వారు ఇబ్బందులు పడకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు సైతం వారి ఊళ్లకు ఇతరులను రావొద్దంటూ గ్రామ పొలిమేరల్లో కంచెలు ఏర్పాటు చేశారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజల అప్రమత్తం..

వరంగల్ కు సరిహద్దు జిల్లాలైనా కరీంనగర్, ఖమ్మంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా జిల్లాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఇతరులు రాకుండా చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వందల సంఖ్యలో విదేశాల నుంచి రాగా వారందరికీ పరీక్షలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను హోం క్వారంటైన్లో ఉంచి పరీక్షిస్తున్నారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లోని క్వారంటైన్ లో ఉన్న కరోనా అనుమానితులు అక్కడి నుంచి వరంగల్ జిల్లా మీదుగా పారిపోతుండగా గుర్తించి వారిని తిరిగి ఆస్పత్రికి తరలించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలను కోరుతున్నారు.


Next Story

Most Viewed