ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ప్రభుత్వ టీచర్ మృతి.. పరారీలో డ్రైవర్

by  |
Meenakshi
X

దిశ, నేరేడుచర్ల : రోడ్డుపై పడిన గుంతలను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఇంటర్ విద్యార్థులతో కలిసి పరీక్షా కేంద్రానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుకుంది. ఈ ప్రమాదంతో విద్యార్థినులకూ గాయాలయ్యాయి. మృతి చెందిన ఉపాధ్యాయురాలు ఎంఈఓ భార్య కావడంతో ఉపాధ్యాయవర్గాల్లో విషాదం అములుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..

మఠంపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న భూక్యా మీనాక్షి (35) ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు హుజూర్ నగర్‌లో ఆటో ఎక్కింది. ఆ ఆటోలో గురుకుల పాఠశాలలో ఎంగ్జామ్స్ రాసేందుకు వెళ్లే విద్యార్థులు సైతం ఎక్కారు. ఆటో మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెం గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపై ఉన్న భారీ గుంతలను తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలోకి పల్టీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, టీచర్ భూక్యా మీనాక్షి తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆమెను స్థానికులు వెంటనే హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

Auto Accident

కాగా మృతురాలి భర్త భూక్యా సైదానాయక్ మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల విద్యాధికారిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరగగానే ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. మీనాక్షి మరణవార్త తెలుసుకున్న ఉపాధ్యాయులు షాక్‌కు గురయ్యారు. ఆమెకు నివాళి అర్పించేందుకు వారి సొంత గ్రామమైన చిలుకూరు మండలం దుద్యా తండాకు భారీగా తరలివస్తున్నారు. మృతురాలి భర్త సైదానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ మమతారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజుర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed