ఘోరం.. కుప్పకూలిన గరుడ వారధి

by  |
ఘోరం.. కుప్పకూలిన గరుడ వారధి
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలో స్మార్ట్​సిటీ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్​ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు భీతిల్లిపోయారు. బస్టాండు సమీపంలో శ్రీనివాసం వద్ద 40 మీటర్ల బ్లాకు మొత్తం కిందకు దిగిపోయింది. ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న కారణంగా తూర్పు వైపున బారికేడ్లు పెట్టి ట్రాఫిక్​ను పడమరవైపు రోడ్డుకు మళ్లించారు. నిర్మాణంలో ఉన్న ఈ బ్లాకు కింద జాకీ సపోర్టు సడలడంతో కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. కూలిన వంతెనను మున్సిపల్​ కమిషనర్ ​గిరిషా, ఇంజనీరింగ్​ అధికారులు పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థకు పలు సూచనలు చేశారు. ఘటనకు దారితీసిన కారణాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.

తూర్పు వైపున వంతెన పనులు చేసే కార్మికులు తప్ప జనం రద్దీ ఉండదు. అందువల్ల ప్రాణాపాయం తప్పింది. గత ప్రభుత్వ హయాంలో రూ.750 కోట్ల వ్యయం అంచనాతో గరుడ వారధి నిర్మాణం మొదలైంది. నాటి ప్రాజెక్టు అంచనాలో 70 శాతం టీటీడీ, 30 శాతం స్మార్ట్ సిటీ కార్పొరేషన్​ నిధులతో నిర్మించేట్లు నిర్ణయించారు. పనులను ఆఫ్కాన్​ కంపెనీ చేపట్టింది. ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ నుంచి నిధులు రాలేదు. కరోనా కారణంగా టీటీడీకి రాబడి తగ్గినందువల్ల అందుబాటులో ఉన్న నిధులతో పనులు చేపట్టాలని సూచించింది. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి​ సూచాయగా వెల్లడించారు.


Next Story