పెండ్లికి వచ్చి చిక్కుకుపోయారు

by  |

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో వివాహ వేడుకకు వచ్చిన 40మంది లాక్‌డౌన్ కారణంగా నెల రోజులుగా ఇక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారికి నిత్యావసర సరుకులు సమకూర్చలేక ఇంటి యజమాని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఐడీఏ బొల్లారానికి చెందిన ఓ యువకుడికి ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన యువతికి గత నెల 20న బొల్లారంలో వివాహం జరిగింది. పెండ్లికి వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడికి వచ్చారు. 23న తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోగా, అదే రోజు నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చంది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో పెళ్లివారింట్లోనే ఉండిపోయారు. అసలే పెళ్లి కుమారుడిది పేద కుటుంబం, తండ్రి ప్లంబర్, కుమారుడు ట్యూషన్లు చెబుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. నెల రోజులుగా 40 మందికి భోజనం ఇతర సదుపాయాలు కల్పించలేక నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు రూ.1500 వరకూ ఖర్చు అవుతుండటమేగాక, అంత మంది ఒకే ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రత్యేక అనుమతి ఇచ్చి తమను ఒడిశాకు పంపాలని వారు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న బొల్లారం సీఐ ప్రశాంత్.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Tags : family, Odisha, trapped, ida Bollaram, lockdown, marriage, police



Next Story

Most Viewed