సినిమా టికెట్ల ధర పెంపుపై త్వరలో నిర్ణయిస్తాం : తలసాని

by  |
Talsani Srinivas
X

దిశ, తెలంగాణ బ్యూరో : సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం సినీ నిర్మాతలతో సమావేశం నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో సినీరంగం పరిస్థితిపై చర్చించారు. సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని నిర్మాతలు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ రెండేళ్ల నుంచి కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటుందన్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు సైతం ధైర్యంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు. థియేటర్ ల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ లో నిర్మించిన చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయని వివరించారు. పలువురు సినీ ప్రముఖులు కరోనా వల్ల సుమారు రెండేళ్లకు పైగా పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకపోయిందని, ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయన్నారు. టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకొని సినీరంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ల ధరల పై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్లకు కానీ, నిర్మాతలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్నబాబు), సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య, రాధాకృష్ణ, ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, భీమ్లా నాయక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాలగోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed