ఓ మగువా.. నీ ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగునా..

by  |
ఓ మగువా.. నీ ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగునా..
X

దిశ, ఫీచర్స్ : ఈ ప్రపంచంలో ప్రతీ ఉద్యోగి, విద్యార్థికి సెలవులుంటాయి. కానీ నిద్రలేచిందే మొదలు రాత్రి పడుకునే దాకా.. నిత్యం శ్రమించే అమ్మలకు, అతివలకు మాత్రం విరామమే లేదు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాదికి ఆనందం. ఆమె ఆనందమే ఇంటికి మహాభాగ్యం అంటారు కానీ, ఇంట్లో అందరి క్షేమం కోరుకునే ఇళ్లాలు తమ అరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. దీంతో నేడు పౌష్టికాహార లోపంతో పాటు బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పీసీఓడీ, రక్తహీనత వంటి ఇతర సమస్యలతో చాలామంది మహిళలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య సంరక్షణలో చైతన్యం పెంచాలనే లక్ష్యంతో కొంతమంది యువతులు.. పాట్నాలో ‘ఖుద్ సే పూచ్’ అనే పేరుతో ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.

ఇప్సోస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్ మహిళల ఆరోగ్యంపై ఓ సర్వే నిర్వహించింది. అందులోని వివరాలతో ‘ఇండియన్ ఉమెన్స్ హెల్త్ రిపోర్ట్’ విడుదల చేయగా.. 1000 మంది మహిళ(25-55 ఏళ్ల)లు పాల్గొన్న ఈ సర్వేలో చాలా మంది యువతులు తమ ఆరోగ్యంపట్ల చాలా నిర్లక్ష్యంగానే ఉన్నట్లు వెల్లడైంది. కాగా కొన్నిసార్లు మహిళలు తమ తమ సమస్యలు గుర్తించి, వాటిని బయట పెట్టే సరికి వ్యాధి ముదిరి చాలా ప్రమాదస్థాయికి చేరుతుంది. మరికొన్ని సార్లు మహిళలు చెప్పినా, ఇంట్లో వాళ్లు పట్టించుకోకపోవడంతో ముప్పు పెరుగుతోంది. తమ ఆరోగ్యం గురించి అవగాహన, చైతన్యం లేకపోవడం వల్లే ఈ ఇబ్బందుల పాలవుతున్నారు. సరైన చికిత్స తీసుకున్నట్లయితే వారి సమస్యలను సులువుగా నయం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే.. సఖి బిహార్, గౌరవ్ గ్రామీణ మహిళా వికాస్ మంచ్, అశోక యంగర్ చేంజ్ మేకర్ వంటి పాట్నాకు చెందిన యువజన సంఘాలు ‘ఖుద్ సే పూచ్’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టాయి.

ఆరోగ్యం మహిళల హక్కు :

క్యాంపెయిన్‌లో భాగంగా లైంగిక, పునరుత్పత్తి, రుతుస్రావం, గర్భనిరోధకాలు, గర్భస్రావాలు, మానసిక ఆరోగ్యం మొదలైన ఇష్యూస్‌పై మహిళల్లో, అమ్మాయిల్లో అంబాసిడర్లు అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సంబంధిత అపోహలు, నమ్మకాలను నివృత్తి చేస్తారు. ఈ క్యాంపెయిన్ కోసం 18-30 మధ్య వయస్సు గల 250 మంది అమ్మాయిలను అంబాసిడర్లుగా నియమించారు. ఇందులో భాగంగా లీడర్‌షిప్, కో క్రియేషన్, స్టోరీ టెల్లింగ్ వంటి నైపుణ్యాలను పెంపొందించే వర్క్‌షాప్‌లకు అంబాసిడర్స్ హాజరవుతారు. మహిళలపై ప్రభావం చూపే వివిధ సమస్యలపై వీళ్లు నిపుణులతో సంభాషించడంతో పాటు, వారిలో మార్పు కోసం మ్యానిఫెస్టోను రూపొందిస్తారు. అంతేకాదు పాట్నా మహిళలందరీ ‘కేర్ విత్ డిగ్నిటీ’ ప్రతిబింబించేలా ఓ ఆరోగ్య చిహ్నాన్ని డిజైన్ చేయడంలో సాయపడతారు. ఆత్మపరిశీలన ద్వారా వారి ఆరోగ్య సంరక్షణ మార్గాలు మహిళలకు తెలిసేలా చేయడమే ‘ఖుద్ సే పూచ్’ లక్ష్యం.

సొంత కథలు:

మహిళలు ఆన్‌లైన్‌లో లేదా కమ్యూనిటీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కానీ ఆరోగ్య సంరక్షణ విషయపై మాట్లాడటం లేదా ఉపన్యాసించడం చాలా తక్కువ. అలాంటి వాళ్లు ఇలాంటి క్యాంపెయిన్‌లో పాల్గొని చైతన్యం పెంచాలి. లేడీస్ లీడ్‌గా ఉంటూ పూర్తిగా భిన్నమైన ప్లాట్‌ఫామ్‌లలో వారి సొంత కథనాలను వివరించాలని ‘ఖుద్ సే పూచ్’ ఆర్గనైజర్స్ ఆశిస్తున్నారు. దీని వల్ల ఆడవాళ్లకు సంబంధించిన ఎన్నో సమస్యలు బయటకు వస్తాయి. దీంతో ఆ సమస్యలపై స్ట్రీ, పురుషులిద్దరికీ పూర్తి అవగాహన వస్తుంది. ఇది మిగతా స్త్రీలతో పాటు పురుష సమాజంపై అలల ప్రభావాన్ని సృష్టిస్తుంది.

ఆరోగ్య సంరక్షణ కోల్పోతున్నారా?

మహిళలు తమ ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడితే, ఇరుగుపొరుగు, ఇంట్లోవాళ్లు, సమాజం ఏదో అనుకుంటారనే అంతర్గత భయం ఉంటుంది. వారి ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు స్వతంత్ర్యంగా తీసుకోలేకపోతున్నారు. ఇతరుల పర్మిషన్‌పై ఆధారపడటంతో కుటుంబ సభ్యులు కూడా వారిని నిరుత్సాహపరుస్తుంటారు. స్త్రీ, పురుషుల ఆరోగ్య సమస్యలు భిన్నంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా వయసు పరంగా మహిళల అవసరాలు మారుతుంటాయి. ఇలాంటి విషయాల్లో ఆరోగ్య నిపుణులు కూడా అవగాహన పెంచేందుకు కృషి చేయాలి. భారతీయ మహిళలు అధికంగా పోషకాహర, రక్తహీనతతో బాధపడుతున్నారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కానీ ఇప్పటికీ దాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

ఒక మహిళకు వైట్ డిశ్చార్జ్ అయితే అది అనారోగ్యకరమైన పనిగా భావించి తనను తాను ద్వేషించుకుంటోంది. అదే ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. పీరియడ్స్‌పై కూడా వారిలో అనేక అపోహాలు ఉన్నాయి. వీటి వల్ల వారు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇలాంటి అపోహలను తొలగిస్తే, వారి ఆరోగ్యంలోనూ మార్పులు తప్పకుండా చూడొచ్చు. ఈ విషయంలో సామాజిక మార్పు కష్టతరమైన పనే. కానీ ప్రజలను ఆన్‌బోర్డ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకోసమే రెండు వారాల్లో 250 మంది మహిళలను అంబాసిడర్లుగా చేర్చుకున్నాం. ఈ క్యాంపెయిన్ ద్వారా లేడీస్ సమిష్టిగా ఒక చిహ్నాన్ని రూపొందించడానికి ఆరోగ్య సంరక్షణలో తమ గౌరవాన్ని నిర్వచించడానికి సమిష్టిగా వస్తారని మేము ఆశిస్తున్నా్ం. ఇప్పటికే దాదాపు 100 మంది మహిళా కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించాం. ప్రస్తుతం వాళ్లు తమ కథలను పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు. యువతరం మహిళలు మాట్లాడటం, అన్వేషించడం ప్రారంభిస్తే చాలు మార్పు మొదలైనట్లే.. అదే చాపకింద నీరులా మెల్లగా వ్యవస్థను మార్చేస్తుంది.
– ఖుద్ సే పూచ్ ఆర్గనైజర్స్



Next Story