దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాం.. బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

by Disha Web Desk 2 |
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాం.. బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ఘట్టం ప్రారంభమైంది. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2014లో దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. అందుకే భారీ మెజార్టీతో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వరించారని అన్నారు. సంస్కరణ పథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారని అన్నారు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలు, మహిళలు, రైతులు, యువకులకు న్యాయం చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేసిందని అన్నారు. కరోనా సంక్షోభం నుంచి ఈ దేశం విజయవంతంగా అధిగమించిందని తెలిపారు.

తమ సమ్మిళిత వృద్ధి ఆలోచనా విధానం గ్రామస్థాయికి చేరి సక్సెస్ అయిందని అభిప్రాయపడ్డారు. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహారం సమస్య తీరిందని అన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారని తెలిపారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని అన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్, ఉపాధి, తాగునీరు, మద్దతు ధర, రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించామని.. అభివృద్ధి అంటే ఇదే అని చెప్పారు. 2047 నాటికి అసమానత, పేదరికం కనబడకుండా చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది కార్యచరణలో లౌకికవాదం అని చెప్పారు.

Next Story

Most Viewed