Operations Sindoor: సరిహద్దుల్లోనే కాదు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేశాం: రాజ్ నాథ్ సింగ్

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ పై రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Operations Sindoor:  సరిహద్దుల్లోనే కాదు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేశాం: రాజ్ నాథ్ సింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Raj Nath Singh) అన్నారు. కేవలం పాక్ సరిహద్దే కాదు రావల్పిండిలోని ఆ దేశ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేశామని సంచలన విషయాలు వెల్లడించారు. ఇవాళ యూపీ లక్నోలోని ఉత్తర‌ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను (BrahMos Aerospace Integration) రాజ్‌నాథ్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇవాళ లక్నో రాలేకపోయానని, పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన రోజునే ఈ యూనిట్ ప్రారంభించడం గొప్పగా ఉందని అన్నారు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తి చేయడంపై అభినందనలు తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు..

భారతమాత కిరీటమైన కశ్మీర్‌పై ఉగ్రవాదులు దాడి చేసి అనేక కుటుంబాల నుంచి ‘సిందూర్’ను తుడిచిపెట్టారని, బాధిత కుటుంబాలకు ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సాయుధ దళాలు న్యాయం చేశాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. భారత్ ఎక్కడా ప్రజలను టార్గెట్ చేయలేదని, పాకిస్తానే భారత ప్రజలు, ఆలయాలు, గురుద్వారాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందన్నారు. పాక్ దాడులను మన సైన్యం దీటుగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇది నయా భారత్ అని, ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని స్పష్టం చేశారన్నారు. ఉరీ, పుల్వామా, పహెల్గాం దాడుల తర్వాత బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తిని తెలియజేశామన్నారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, భారతదేశ రాజకీయ, సామాజిక వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నం అని పేర్కొన్నారు.

Next Story