Air India: పాక్ తో సరిహద్దు ఉన్న సిటీలకు విమానరాకపోకల నిలిపివేత

by Shamantha N |

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ దాయాది దేశం ఇంకా దాడులకు యత్నిస్తూనే ఉంది.

Air India: పాక్ తో సరిహద్దు ఉన్న సిటీలకు విమానరాకపోకల నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ దాయాది దేశం ఇంకా దాడులకు యత్నిస్తూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో సోమవారం రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే, ఈ పరిణామాల మధ్య దేశీయవిమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న సిటీలకు విమాన సర్వీసులు(Flights Cancelled) రద్దయ్యాయి. ఈ మేరకు విమానలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా, ఇండిగో ప్రకటించారు. ‘‘ భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్ము, లేహ్‌, జోధ్‌పుర్‌, అమృత్‌సర్‌, భుజ్‌, జామ్‌నగర్‌, చండీగఢ్‌, రాజ్‌కోట్‌ నగరాలకు మంగళవారం (మే 13) విమాన రాకపోకలు నిలిపివేస్తున్నాం. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం’’ అని ఎయిర్‌ ఇండియా (Air India) తమ ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు, ఇండిగో కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ‘‘ప్రయాణికుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. దీని వల్ల మీ ప్రయాణ షెడ్యూల్ లో అంతరాయం ఏర్పడినా రద్దు చేయక తప్పట్లేదు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాం’’ అని కంపెనీ పేర్కొంది. శ్రీనగర్‌, లేహ్‌, రాజ్‌కోట్‌, చండీగఢ్‌, జమ్ము, అమృత్‌సర్‌ ప్రాంతాలకు ఇండిగో (IngiGo) ఫ్లైట్స్ నిలిపివేసింది.

పందొమ్మిది రోజుల తర్వాత..

దాదాపు, పందొమ్మిది రోజుల తర్వాత సరిహద్దుల్లో సోమవారం ప్రశాంతత నెలకొంది. అయితే, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు అనిపించడంతో సోమవారం నుంచి 32 ఎయిర్‌పోర్టులు తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో విమాన సేవలను పునరుద్ధరించేందుకు ఎయిర్‌లైన్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే, జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కన్పించాయి. అంతేకాకుండా, పంజాబ్‌లోని జలంధర్‌లో నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్లు సైనిక బలగాలు ప్రకటించాయి. అయితే, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని బలగాలు తెలిపాయి. కాగా.. ఈ పరిణామాలతో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కొంతదూరం వెళ్లాక తిరిగి వెనక్కి మళ్లించారు. ఆ తర్వాత విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఇండిగో, ఎయిరిండియా ప్రకటించాయి.

Next Story