Pak ministry: రుణాల కోసం పాక్ పోస్టు.. ఎక్స్ హ్యాక్ అయ్యిందని బుకాయింపు

by Shamantha N |
Pak ministry: రుణాల కోసం పాక్ పోస్టు.. ఎక్స్ హ్యాక్ అయ్యిందని బుకాయింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రస్థావాలపై భారత్ చేపట్టిన దాడిని పాక్ సహించలేకపోయింది. దీంతో, భారత్‌ ఆర్మీ, సాధారణ పౌరులపై దాడికి తెగించింది. దీంతో పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఆర్థికంగా దిగజారిపోయింది. దీంతో, వాటినుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం పోటీ పడుతోంది. అయితే, తమకు ఆర్థికసాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఇందులో భారత్‌పై విమర్శలు గుప్పించింది. దీంతో, ప్రపంచం ఎదుటే దాయాది చులకనయిపోయింది. కాగా.. తాము రుణాల కోసం ఎలాంటి పోస్టు పెట్టలేదని.. తమ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని పాక్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. దాన్ని సమర్థించుకొనేందుకు ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ చేసినట్లు ఆ దేశ సమాచార శాఖ ఓ పోస్టు చేసింది.

పాక్ ఏమందంటే?

కాగా.. భారత్ ఆకస్మిక దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందంటూ ప్రపంచ బ్యాంక్‌ను ట్యాంగ్ చేస్తూ పాక్ ఆర్థిక వ్యవహరాల విభాగం ‘X’ వేదికగా చేసిన పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత్‌తో పెట్టుకుని తాము అన్ని విధాలుగా నష్టపోయామని తెలిపారు. యుద్ధం తీవ్రతరం అవుతోందని.. తమ వద్ద ఉన్న నిల్వలు అడుగంటాయని అన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గించడంలో భాగంగా అంతర్జాతీయ భాగస్వాములు తమకు సహకారం అందజేయాలని ఆ ట్వీట్‌‌లో పేర్కొన్నారు. మరోవైపు, పాకిస్థాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఎలాంటి రుణాలు రాకుండా అడ్డుకొనేందుకు భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాక్‌ ‘పోస్టులు’ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధ వాతావరణంతో ఇప్పటికే పాకిస్థాన్‌ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ‘భిక్షమెత్తుకునేందుకు ఇదొక మార్గమా?’ అంటూ పాక్‌ను ట్రోల్‌ చేస్తూ పీఐబీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.



Next Story