Operation Sindoor: అలర్ట్ అయిన సరిహద్దు రాష్ట్రాలు

by S Gopi |

పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ తాజా కఠిన చర్యలు తీసుకున్నాయి.

Operation Sindoor: అలర్ట్ అయిన సరిహద్దు రాష్ట్రాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావారణం నేపథ్యంలో అనేక రాష్ట్రాలు పాఠశాలలను మూసివేస్తున్నట్లు, సరిహద్దు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు, పోలీసు సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం క్రూర దాడికి స్పందనగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. గురువారం పరిస్థితులు పూర్తిగా యుద్ధ వాతావరణంలోకి మారడంతో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ తాజా కఠిన చర్యలు తీసుకున్నాయి. పంజాబ్ పాకిస్తాన్‌కు 532 కి.మీ, రాజస్థాన్ దాదాపు 1,070 కి.మీ, గుజరాత్ దాదాపు 506 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్‌తో 2,217 కి.మీ సరిహద్దును కలిగి ఉంది.

పంజాబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేయగా, ఆరు సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసిందని అధికారులు గురువారం తెలిపారు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఉన్నతాధికారుల అనుమతితో సెలవులు మంజూరు చేయాలని పంజాబ్ డీజీపీ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తరణ్ తారణ్‌లలో ఉన్న అన్ని పాఠశాలలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేయాలని నిర్ణయించారు. గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ ప్రకటించామని అధికారులు తెలిపారు. ఏదైనా సైనిక చర్యలు మొదలైతే పంజాబ్ ప్రభుత్వ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచామని పంజాబ్ మంత్రి అమన్ అరోరా తెలిపారు.

హర్యానాలో సైతం రాష్ట్ర పోలీసు సిబ్బంది, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారి సెలవులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేశారు. అన్ని జిల్లాల సివిల్ సర్జన్లకు పంపిన సమాచారం ప్రకారం, అందరు అధికారులు వారి ప్రస్తుత పోస్టింగ్ ప్రాంతాల్లోనే ఉండాలని, జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. పెరుగుతున్న ఘర్షణల కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తన ఉద్యోగులందరి సెలవులను కూడా రద్దు చేసింది. ప్రస్తుత పరిస్థితులను, ఏదైనా అత్యవసర పరిస్థితికి సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఎవరికీ సెలవు మంజూరు చేయరని ప్రభుత్వ సేవల విభాగం గురువారం సాయంత్రం ఆలస్యంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

పంజాబ్‌తో సరిహద్దు కలిగిన హిమాచల్ ప్రదేశ్‌లో, హమీర్‌పూర్, ఉనా, బిలాస్‌పూర్‌తో సహా సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాబా బాలక్ నాథ్, మా చింతపూర్ణి, మా నైనా దేవి వంటి ప్రసిద్ధ దేవాలయాలు ఈ జిల్లాల్లో ఉన్నందున, పోలీసులు అక్కడ భద్రతా తనిఖీలను ముమ్మరం చేశారని ఒక అధికారి స్పష్టం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మోహరించిన పరిపాలనా, పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ఐదు సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు.

పశ్చిమ రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించడంతో, ఈ ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ అమలు చేశారు. వైమానిక దాడులకు వ్యతిరేకంగా రక్షణకు, బార్మర్, జైసల్మేర్‌లలో కీలకమైన ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలు ఉన్నందున రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు బ్లాక్‌అవుట్ అమలులో ఉంటుంది. జోధ్‌పూర్‌లో తెల్లవారుజామున 12.30 నుంచి ఉదయం 4 గంటల వరకు బ్లాక్‌అవుట్ అమలులో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్‌లను ఎగురవేయడం, క్రాకర్లు పేల్చడం నిషేధించారు. గుజరాత్ తీరప్రాంతంలో భద్రతను పెంచారు. అధికారులు పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశారు, వారు వెంటనే విధులకు తిరిగి రావాలని ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తదుపరి నోటీసులు వచ్చే వరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.

Next Story