Air Marshal: ఉగ్రవాదంపైనే భారత్ పోరు.. పాక్ జోక్యం చేసుకోవడం విచారకరం

by Shamantha N |

ఉగ్రవాదంపై పోరు ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Air Marshal: ఉగ్రవాదంపైనే భారత్ పోరు.. పాక్ జోక్యం చేసుకోవడం విచారకరం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదంపై పోరు ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే భారత్ పోరు అని వెల్లడించారు. అందులో భాగంగా పాకిస్థాన్‌పై దాడుల వీడియోలను అధికారులు ప్రదర్శించారు. భారత్ ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే.. అందులో పాక్ జోక్యం చేసుకోవాలనుకోవడం విచారకరం అని పేర్కొన్నారు. దాయాది సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మార్చుకున్నాయని ఆరోపించారు. అందుకే, భారత సైన్యం దీటుగా జవాబు ఇచ్చిందని చెప్పారు. పాకిస్థాన్‌ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ దాడుల సమయంలో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శత్రువులను అడ్డకున్నాయన్నారు. ఇస్లామాబాద్ ఆటలు సాగనివ్వలేదన్నారు. "స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ రక్షణ వ్యవస్థ అద్భుతమైన పనితీరు గురించి వివరించారు. గత దశాబ్దంలో భారత ప్రభుత్వం నుండి బడ్జెట్, విధాన మద్దతు కారణంగా మాత్రమే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వాతావరణం అమలు చేయడం సాధ్యమైంది" అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు.

ఏకే భారతి మాట్లాడుతూ..

ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్‌, పీవోకేలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాం. పీవోకేలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశాం. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్‌ క్షిపణులు, డ్రోన్‌లను తిప్పికొట్టాం. పాక్ దాడులను వాయుసేన సిబ్బంది సమర్థంగా అడ్డుకున్నారు. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాంరు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్‌ను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించాం. పాక్ పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు. చైనా తయారు చేసిన పీఎల్‌-15 క్షిపణిని నేలకూల్చాం. పాకిస్థాన్‌కు చెందిన అనేక డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చివేశాం. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్‌ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టాం. కరాచీ సమీపంలోని లక్ష్యాలపైనా దాడులు చేశాం’’ అని ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి వెల్లడించారు. భారత సైనిక స్థావరాలు, అన్ని రక్షణ వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తూనే ఉన్నాయన్నారు. అవసరమైతే భవిష్యత్తులో ఏదైనా మిషన్లను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

Next Story