Miss India to ఆర్మీ ఆఫీసర్‌.!

by Daayi Srishailam |
Miss India to ఆర్మీ ఆఫీసర్‌.!
X

ఒకవైపు ఆపరేషన్ సిందూర్.

ఇంకోవైపు మిస్ వరల్డ్ పోటీలు.

రెండు వేర్వేరు సబ్జెక్ట్‌లు.. వేర్వేరు రంగాలు.

ఈ రెండింటింతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరున్నారు.

"ఇండియా మిస్ చార్మింగ్ ఫేస్" అందాల కిరీటాన్ని గెలుచుకున్నా..

"ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కమిషనర్"గా బాధ్యత తీసుకున్నా..

అది ఆమె ఒక్కరికే సాధ్యమైంది.

ఆ డేరింగ్ అండ్ బ్యూటీయెస్ట్ ఆఫీసరే గరిమా యాదవ్.

- దిశ, ఫీచర్స్

అందాల పోటీలో విజేతగా గెలిచిన గరిమా యాదవ్.. భారత సైన్యంలో అధికారిణిగా మారడం నిజంగా ఒకింత ఆశ్చర్యం. ఆమె ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. సాంప్రదాయ ఆలోచనలను ఛేదిస్తూ.. సంకల్పశక్తి.. దేశసేవను చాటిచెప్పే గరిమా కథ సిందూర్ వంటి ఆపరేషన్స్‌లో పాల్గొనాలి అనేవారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఐఏఎస్ ప్రిపరేషన్

ఆర్మీ ఫ్యామిలీలో జన్మించిన గరిమా యాదవ్.. చిన్నతనం నుంచే క్రమశిక్షణ.. దేశభక్తి వంటి ఆదర్శాలను అలవర్చుకుంది. షిమ్లాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ డాగ్‌షాయ్‌లో చదువుకుంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక "సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ"లో ఎకనామిక్స్ బాచిలర్ డిగ్రీ చేసింది. ఇక్కడే ఆమె విశ్లేషణాత్మక నైపుణ్యాలను మెరుగుపరిచి.. భవిష్యత్ లక్ష్యాలను బలమైన పునాది వేసింది. మొదట్లో ఐఏఎస్ కావాలని అనుకునేది గరిమా. ఆ దిశగా ప్రిపేరైంది. మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయింది. కానీ తన సంకల్పాన్ని కోల్పోలేదు. ఒకవైపు ఐఏఎస్ కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తూనే భవిష్యత్ లక్ష్యాలను అన్వేషించడం ప్రారంభించింది.

అందాల పోటీవైపు ఆకర్షణ

ఐఏఎస్ కావాలని ప్రిపరేషన్ సాగిస్తున్న గరిమా యాదవ్.. అనూహ్యంగా అందాల పోటీలవైపు ఆకర్షితురాలైంది. ఆ జర్నీ ఆమె కూడా ఊహించలేదు. ఏ రంగంలో ఉన్నా.. ఆ వేదిక నుంచి సమాజానికి మంచి సందేశాన్నివ్వాలనేది ఆమె ఆలోచన. అలా 2017లో గరిమా "ఇండియాస్ మిస్ ఛార్మింగ్ ఫేస్" అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ పోటీ ఆమెకు ఇటలీలో అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించింది. అక్కడివరకు వెళ్లనైతే వెళ్లిందిగానీ.. తన మనసెందుకో దేశసేవను కోరుకుంటోంది. భారత సైన్యంలో చేరాలనే నిర్ణయం తీసుకుంది. సైన్యంలో సేవ చేయడం అందాల పోటీల కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే నమ్మకంతో ముందుకెళ్లింది.

సైన్యంలో పాల్గొనాలనే సకల్పం

ఆర్మీలో చేరాలనే ఆకాంక్షతో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షకు ప్రిపేరషన్ మొదలుపెట్టింది. తన మొదటి ప్రయత్నంలోనే సీడీఎస్ ఆలిండియా 2వ ర్యాంక్ (ఏఐఆర్) సాధించి.. తన తెలివి తేటలను.. కఠోరశ్రమను నిరూపించింది. ఈ విజయం ఆమెను చెన్నయ్‌లోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో స్థానం సంపాదించేలా చేసింది. ఓటీఏలోని కఠినమైన శిక్షణ గరిమ శారీరక.. మానసిక సహనశక్తిని పరీక్షించింది. మొదట్లో శారీరక సామర్థ్యం అంతగా లేక కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత ఫిట్‌నెస్ సాధించింది. స్వీయ మెరుగుదల.. నిబద్దత ఆమెను అకాడమీలోని అన్ని కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసింది.

భవిష్యత్ తరాలకు స్ఫూర్తి.

2019 మార్చి 9న.. గరిమా యాదవ్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ కమిషన్ చేసింది. లెఫ్టినెంట్‌గా గరిమ రిక్రూట్లకు శిక్షణ ఇవ్వడం.. సైనిక కార్యకలాపాల్లో పాల్గొనడం.. భారత సైన్యం మిషన్‌కు సహకరించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. తల్లిగా తన కుమార్తెతో వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేస్తూ ధైర్యంగా ముందుకు సాగుతోంది. గరిమా ఆదర్శవంతమైన లెఫ్టినెంట్ ఆఫీసరే కాదు.. ఒక ఒంటరి మహిళ కూడా. తల్లిగా.. సైనికాధికారిగా ఆమె సమర్థవంతమైన పాత్రను పోషిస్తోంది. ఒకప్పుడు అందాల పోటీలు.. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్.. రెండింట్లోనూ సక్సెస్‌ఫుల్ జర్నీ ఆమెది. విభిన్న రంగాల్లో రాణించగలరు అనేదానికి గరిమ ఒక ఎగ్జాంపుల్. ఆమె భవిష్యత్ తరాలకు స్ఫూర్తి.



Next Story

Most Viewed