Mehbooba Mufti: కంటతడి పెట్టుకున్న జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ

by Shamantha N |
Mehbooba Mufti: కంటతడి పెట్టుకున్న జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌-పాక్‌ ఉద్రిక్తలు తీవ్రతరమయ్యాయి. కాగా.. ఇలాంటి సమయంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు మృతిచెందడంపై మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కళ్లముందే ఆడుకుంటున్న కవలలు అంతలోనే రక్తపుమడుగులో కనిపించారు. ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, మహిళలు చేసిన తప్పేంటి..? ఇది ఎక్కడివరకు వెళ్తుంది. జమ్ముకశ్మీర్‌ ప్రజలు మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల వారు ఇంకా ఎంతకాలం బాధపడాలి..? ఇంకెంత కాలం ఈ కడుపుకోత..?’’ అని ప్రశ్నించారు. అలా మాట్లాడుతూ ఆమె కంటతడిపెట్టారు. భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తిగా ఎదుగుతోందని ముఫ్తీ అన్నారు. కాగా.. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. అంతర్గత పరిస్థితి కూడా బాగాలేదన్నారు. "ఈ దాడిని ముగించాలని రెండు వైపులా ఉన్న నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇద్దరు ప్రధానమంత్రులు ఫోన్ చేసి ఈ వివాదాన్ని పరిష్కరించుకావాలి" అని ఆమె సూచించారు. అంతేకాకుండా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. "రెండు దేశాల నాయకత్వం తమ మనస్సును మార్చుకుని, ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఆలోచించాలి." అని అన్నారు.

ఇరు దేశాలకు విజ్ఞప్తి

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)తో దిక్కుతోచని పాకిస్థాన్‌.. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కుప్వారా, బారాముల్లా, ఉరీ, పూంఛ్, మెంథార్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్లు, శక్తిమంతమైన శతఘ్నులతో కాల్పులకు తెగబడింది. దీంతో బుధ, గురువారాల్లో 16 మంది మరణించారు. ఇందులో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పూంఛ్, రాజౌరీ, జమ్ములో మరోసారి పాక్‌ కాల్పులు, షెల్లింగ్‌ జరిపింది. క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. వాటిని భారత్ సమర్థంగా అడ్డుకుంది.



Next Story

Most Viewed