Ceasefire: మళ్లీ దాడులు చేస్తే సహించబోము.. రక్షణ మంత్రిత్వ శాఖ వార్నింగ్

by vinod kumar |
Ceasefire: మళ్లీ దాడులు చేస్తే సహించబోము.. రక్షణ మంత్రిత్వ శాఖ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ (India pakisthan) మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని అయితే మళ్లీ దాడులకు పాల్పడితే మాత్రం పాక్‌కు తగిన సమాధానం ఇస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సీజ్ ఫైర్ ప్రకటన అనంతరం శనివారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమడోర్ రఘు ఆర్ నాయర్ మాట్లాడారు. ‘ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనకు మేము కట్టుబడి ఉంటాం. కానీ మళ్లీ దాడులకు పాల్పడితే తీవ్ర పరిణాలుంటాయి. వాటిని తిప్పకొట్టడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మాతృభూమి సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉంటుంది’ అని తెలిపారు. పాకిస్తాన్ చేసే ఏ సాహసోపేతమైన చర్యలనైనా గట్టిగా ఎదుర్కొంటామన్నారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఏ కార్యకలాపాలనైనా చేపట్టడానికి రెడీగా ఉన్నామన్నారు. ఉద్రిక్తతలను పెంచడానికి ప్రయత్నిస్తే తీవ్ర చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్ ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు సైతం పాల్గొన్నారు.

పాక్ ఆరోపణలు అవాస్తవం: కల్నల్ సోఫియా ఖురేషీ

భారత్‌కు చెందిన ఎస్-400, జేఎఫ్-17లు ధ్వంసం చేశామని పాక్ చేసిన ఆరోపణలను కల్నల్ సోఫియా ఖురేషీ ఖండించారు. పాక్ దాడుల్లో ఎటువంటి వైమాణిక రక్షణ వ్యవస్థలు దెబ్బతినలేదని స్పష్టం చేశారు. సిర్సా, జమ్మూ, పఠాన్‌కోట్, భటిండా, నలియా, భుజ్ వంటి మా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని పాక్ చేస్తున్న ప్రచారం కూడా అవాస్తమని తెలిపారు. చండీగఢ్, వ్యాస్‌లోని మందుగుండు సామగ్రి డిపో దెబ్బతిడం కూడా పుకారేనని కొట్టి పారేశారు. ఈ సైనిక సౌకర్యాలన్నీ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని వెల్లడించారు. భారత సైన్యం మసీదులను ధ్వంసం చేసిందని పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలు చేసిందని, కానీ భారత్ ఒక లౌకి దేశం దాని రాజ్యాంగ విలువలకు లోబడి నడుచుకుంటుందని చెప్పారు.



Next Story

Most Viewed