కాంగ్రెస్ తుది జాబితాకు ముహూర్తం ఖరారు.. హైదరాబాద్‌లో మజ్లిస్‌తో ఫ్రెండ్లీ కాంటెస్టేనా?

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ తుది జాబితాకు ముహూర్తం ఖరారు.. హైదరాబాద్‌లో మజ్లిస్‌తో ఫ్రెండ్లీ కాంటెస్టేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 14 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అగ్ర నాయకత్వం కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. హైదరాబాద్‌లో మజ్లిస్‌తో స్నేహ సంబంధాలు ఉన్నందున ఫ్రెండ్లీ కాంటెస్ట్‌కు మాత్రమే పరిమితం కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు పార్టీ నేతల నుంచి ఒత్తిడి, మరోవైపు సామాజక సమీకరణాలు పార్టీ నాయకత్వానికి సవాలుగా మారాయి. ఈ రెండు చోట్లా బలమైన పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా మారింది.

ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల గురించి పార్టీ నాయకులతో చర్చిస్తారని వార్తలు వచ్చినా కేవలం ప్రైవేటు టీవీ ఛానెల్‌ ప్రోగ్రాంకు మాత్రమే పరిమితమయ్యారు. రాత్రికే తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. షెడ్యూలు ప్రకారం శనివారం ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉన్నందున మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యుడైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితితో పాటు కచ్చితంగా గెలిచే అభ్యర్థులను ఫైనల్ చేయడం కీలకంగా మారింది. ఇప్పటివరకు పలు దఫాలుగా చర్చలు జరిగినా అభ్యర్థులను ఫైనల్ చేయకుండా పెండింగ్‌లో పెట్టింది.

ఈ మూడు స్థానాల అభ్యర్థులను శనివారం మీటింగ్‌లో ఏఐసీసీ ఫైనల్ చేస్తుందని, ఇదే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణకు సంబంధించి చివరి సమావేశం కావచ్చని పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో 14 స్థానాల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో అటు ఏఐసీసీ, ఇటు పీసీసీ నేతలు ఆచితూచి అడుగేస్తున్నారు. ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలోని అసెంబ్లీ లీడర్లు, ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగులు నిర్వహిస్తున్న సీఎం రేవంత్... అనుకున్న టార్గెట్‌ను రీచ్ కావడంలో వివిధ స్థాయిల్లోని లీడర్లు, కేడర్ సమిష్టిగా కృషి చేయాలని కోరుతున్నారు. ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్లలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే కాక మొత్తం జిల్లాలోని పది స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.

కరీంనగర్ విషయంలో సైతం మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం రెండు (కరీంనగర్, హుజూరాబాద్) మినహా మిగిలిన ఐదింటినీ కాంగ్రెస్ గెల్చుకున్నది. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా బీజేపీకి చెందిన బండి సంజయ్ ఉండడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోరాదన్న ఉద్దేశంతో గట్టి పోటీ ఇచ్చి గెలుపొందే అభ్యర్థి కోసం కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. మొదటి నుంచీ ఈ రెండు స్థానాల్లో ఏ అభ్యర్థిని పార్టీ ఖరారు చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది. అభ్యర్థుల్ని ఫైనల్ చేసేందుకు నిర్వహిస్తున్న చివరి సమావేశం కావడంతో శనివారం రాత్రికే ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేని పరిస్థితుల్లో ఆలస్యమైతే ఆదివారం మధ్యాహ్నం లోగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నాయి.

Next Story

Most Viewed