ఆ విషయంలో నాకు అనుమానం ఉంది.. రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్టు చేయించాలి: కేరళ ఎమ్మెల్యే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు

by Dishanational5 |
ఆ విషయంలో నాకు అనుమానం ఉంది.. రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్టు చేయించాలి: కేరళ ఎమ్మెల్యే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో అధికార ‘లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్’(ఎల్డీఎఫ్) ప్రభుత్వం నుంచి మద్దతు ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నిజంగా గాంధీకి కుటుంబానికి చెందిన వ్యక్తో కాదో తెలుసుకునేందుకు ఆయనకు డీఎన్ఏ టెస్టు చేయించాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాలక్కడ్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అన్వర్ మాట్లాడుతూ, ‘‘నేను నిలంబర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇది రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉంటుంది. అయితే, రాహుల్ గాంధీని నేను ఆయన ఇంటి పేరుతో పిలవాలనుకోవడం లేదు. ఆయన అధమ(కింది) స్థాయి పౌరుడిగా మారిపోయారు. అలా దిగజారిపోయిన వ్యక్తి.. తన పేరు చివరన గాంధీ అని పెట్టుకునేందుకు అనర్హుడు. ఈ మాట నేను చెప్పట్లేదు. గత రెండు రోజులుగా భారత ప్రజలే చెబుతున్నారు. నెహ్రూ కుటుంబంలో ఇలాంటి సభ్యులు ఉంటారా?.. నెహ్రూ కుటుంబంలో పుట్టినవారు ఎవరైనా అలా దిగజారుతారా? ఈ విషయంలో నాకు చాలా సందేహాలున్నాయి. స్పష్టత కోసం రాహుల్ గాంధీ డీఎన్‌ఏను పరీక్షించాలని నా అభిప్రాయం. జవహర్‌లాల్ నెహ్రూ మనవడిగా ఎదిగే హక్కు రాహుల్‌కు లేదు. అసలు రాహుల్ గాంధీ మోడీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారా? అన్న విషయంపైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ.. సీఎం పినరయి విజయన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సీఎం విజయన్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే, తెరవెనుక విజయన్ బీజేపీకి మద్దతుదారుడని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వర్ పైవిధంగా మాట్లాడారు.

ఈసీకి ఫిర్యాదు

అన్వర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై కేరళ కాంగ్రెస్ చీఫ్ ఎం.ఎం హాసన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, నీచమైన భాషతో నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని అవమానించిన అన్వర్‌పై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసులనూ డిమాండ్ చేశారు. ‘‘పీవీ అన్వర్ గాడ్సేకు సరికొత్త రూపం. అతని మాటలు గాంధీజి గుండెల్లో దిగిన బుల్లెట్ల కంటే ఘోరంగా ఉన్నాయి’’ అని వెల్లడించారు. సీఎం పినరయి విజయనే అన్వర్‌తో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. పీవీ అన్వర్ సీఎం ఆత్మాహుతి దళంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

విమర్శలకు రాహుల్ అతీతుడు కాదు: పినరయి

ఈ వ్యవహారంపై స్పందించిన పినరయి విజయన్.. అన్వర్‌ను సమర్థించడం గమనార్హం. తనపై చేసిన ఆరోపణలకు రాహుల్ గాంధీకి సమాధానం వస్తుందని, ఎందుకంటే అతను విమర్శలకు అతీతుడు కాదని చెప్పినట్టు ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.





Next Story

Most Viewed