తెలంగాణలో వారి ఓట్లే అధికం.. వివరాలు విడుదల చేసిన సీఈఓ

by Disha Web Desk 2 |
తెలంగాణలో వారి ఓట్లే అధికం.. వివరాలు విడుదల చేసిన సీఈఓ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 17 ఎంపీ సెగ్మెంట్లలోని ఓటర్ల వివరాలను గత నెల ఫస్ట్ వీక్‌లోనే రిలీజ్ చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం తాజా వివరాలను మంగళవారం వెల్లడించింది. రాష్ట్రం మొత్తం మీద 3,30,13,318 మంది ఓటర్లు ఉంటే ఇందులో మహిళలు 1,65,95,896 మంది కాగా మిగిలినవారు (1,64,14,693 మంది) పురుష ఓటర్లు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిలో సర్వీసు ఓటర్లు 15,472 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఫస్ట్ టైమ్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారు 8,72,116 మంది యూత్ ఉన్నారు. సూపర్ సీనియర్ సిటిజెన్స్ (85 ఏండ్లు పైబడిన) ఓటర్లు 1,93,472 మంది ఉన్నట్లు సీఈఓ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటివరకు తయారైన ముసాయిదా ఓటర్ల జాబితాలో చిరునామాలు మార్చుకోవాలనుకునేవారు, ఒక నియోజకవర్గం నుంచి మరో చోటికి బదిలీ కావాలనుకునేవారికి వచ్చే నెల 15 వరకు సీఈఓ ఆఫీస్ వెసులుబాటు కల్పించింది. నిబంధనల ప్రకారం ఫామ్-8లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా కొత్తగా చేరాల్సిన ఓటర్ల దరఖాస్తులు, డిలీషన్స్ కోసం వచ్చిన అప్లికేషన్లను మార్చి 25వ తేదీ నాటికి కంప్లీట్ చేయడంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3.30 కోట్లుగా తేలిందని పేర్కొన్నది.

రెండు వారాల్లో రూ. 38 కోట్ల నగదు స్వాధీనం :

లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం రూ. 38.12 కోట్ల మేర నగదు, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో నగదు రూపంలో 9.10 కోట్లు స్వాధీనంకాగా, సుమారు రూ. 8.14 కోట్ల విలువైన 28 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నట్లు వివరించింది. సుమారు రూ. 13.66 కోట్ల విలువైన 4 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలిపింది. నగదు రూపంలో కరీంనగర్ టౌన్‌లోని ప్రతిమా మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లో ఒకేసారి రూ. 6.67 కోట్ల మేర నగదును ఈ నెల 16న స్వాధీనం చేసుకున్నామని, ఈ నగదుకు సంబంధించి థియేటర్ మేనేజర్ నుంచి తగిన ధృవీకరణ పత్రాలు, ఆధారాలను చూపించలేదని వివరించింది. ఈ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని తెలిపింది.

Next Story

Most Viewed