తెలంగాణ మరో కర్ణాటక కావద్దు.. అలాంటి పరిస్థితి ఇక్కడ రావొద్దు

by Disha Web Desk 2 |
తెలంగాణ మరో కర్ణాటక కావద్దు.. అలాంటి పరిస్థితి ఇక్కడ రావొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం డేంజర్‌లో పడిందని కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంజీ మహేష్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 నెలల కింద కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని, అయితే గెలిపించిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీ తీరుపై కోపంగా ఉన్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ పాలసీ అని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం కమ్యూనిటీని కాపాడుతోందన్నారు. కర్ణాటకలో జై శ్రీరామ్, హనుమాన్ చాలీసా కూడా చడవనివ్వడం లేదని విమర్శలు చేశారు. రేప్, మర్డర్లు జరుగుతున్నాయని, దీంతో మహిళలు భయపడుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రామేశ్వరం ఫుడ్ కోర్ట్‌లో పేలుడు జరిగిందని, తొలుత దీన్ని గ్యాస్ పేలిందని కవర్ చేశారని, కానీ చివరకు పేలుడు అని తేలిందని మహేశ్ అన్నారు. కాంగ్రెస్ ఒక తుక్ డే గ్యాంగ్ అని ఫైరయ్యారు. భారత్ తోడో నినాదం కాంగ్రెస్‌ది అయితే.. భారత్ జోడో నినాదం బీజేపీది అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ దేశానికి ప్రమాదకరమని ఆయన విమర్శలు గుప్పించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని తెలంగాణ ప్రజలను కోరారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోతోందని, కాంగ్రెస్ వల్ల కర్ణాటకలో హిందువులు భయం గుప్పిట్లో బతుకుతున్నారన్నారు. కేరళ ఫైల్స్ లాంటిదే.. కర్ణాటక ఫైల్స్ త్వరలోనే రానుందని, తెలంగాణ ఫైల్స్ కూడా వస్తుందన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ముందుకెళ్లాలని, అందుకు బీజేపీకి ఓటేసి గెలిపించాలని, తెలంగాణ మరో కర్ణాటక కావద్దని మహేశ్ కోరారు.

అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజలను విడగొట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఫైరయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు ఒక్కటేనని, బీజేపీని ఓడించాలని వారంతా ఒక్కటయ్యారన్నారు. బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని, కాంగ్రెస్.. ట్యాక్సుల పేరిట వసూళ్లు చేస్తోందని ఆరోపణలు చేశారు. సమాజాన్ని చీల్చి అధికారంలోకి రావాలని చూస్తే బీజేపీ ఊరుకోదని సుభాష్ హెచ్చరించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ఫేక్ వీడియో లాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed