కోహ్లీ గాయంపై అప్‌డేట్ ఇచ్చిన హెడ్ కోచ్.. గాయం పెద్దదేనా?

by Harish |

ఐపీఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు.

కోహ్లీ గాయంపై అప్‌డేట్ ఇచ్చిన హెడ్ కోచ్.. గాయం పెద్దదేనా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతని బొటన వేలుకు గాయమైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో కృనాల్ పాండ్యా వేసిన 12వ ఓవర్‌లో ఘటన చోటుచేసుకుంది. సాయి సుదర్శన్ డీప్ వికెట్‌ దిశగా షాట్ ఆడగా బౌండరీ వద్ద కోహ్లీ బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి అతని బొటన వేలికి బలంగా తాకింది.

నొప్పితో విలవిలలాడిన అతను మైదానంలో మోకాలిపై కూర్చుండిపోయాడు. ఆర్సీబీ మెడికల్ స్టాఫ్ మైదానంలోకి వచ్చి విరాట్‌కు చికిత్స అందించింది. అనంతరం అతను ఫీల్డింగ్ కొనసాగించాడు. కానీ, మైదానంలో బొటనవేలితో ఇబ్బంది పడుతూనే కనిపించాడు. దీంతో అతనికి తాకిన గాయం చిన్నదా?పెద్దదా? అని జట్టుతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది.

అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్‌కు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఊరటనిచ్చే విషయం చెప్పాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ గాయంపై స్పందించాడు. విరాట్ బాగానే ఉన్నాడని చెప్పాడు. అతనికి తాకిన గాయం పెద్దది కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఆ మ్యాచ్‌లో బెంగళూరు పరాజయం పాలైన విషయం తెలిసిందే. వరుసగా రెండు విజయాలతో జోరు కనబర్చిన బెంగళూరుకు సొంతగడ్డపై గుజరాత్ షాకిచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 59, 31 పరుగులతో రాణించిన కోహ్లీ.. గుజరాత్‌పై 7 పరుగుల అవుటై నిరాశపరిచాడు.

Next Story