బెంగళూరు ఇంటికి.. క్వాలిఫయర్-2కు రాజస్థాన్

by Harish |
బెంగళూరు ఇంటికి.. క్వాలిఫయర్-2కు రాజస్థాన్
X

దిశ, స్పోర్ట్స్ : వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ కీలక పోరులో పుంజుకుంది. ఎలిమినేటర్‌లో విజయంతో ఆ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకోగా.. ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. రజత్ పటిదార్(43), కోహ్లీ(33), లోమ్రోర్(32) రాణించారు. అవేశ్ ఖాన్(3/44), అశ్విన్(2/19) బంతితో రెచ్చిపోయి ఆర్సీబీని మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. యశస్వి జైశ్వాల్(45), రియాన్ పరాగ్(36), హెట్మేయర్(16) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్‌తో తలపడనుంది.

మరో ఓవర్ మిగిలి ఉండగానే..

173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే, ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ ఛేదన మరీ సాఫీగా ఏం సాగలేదు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రాణించడంతో ఛేదనలో జట్టుకు శుభారంభం దక్కింది. యశ్ దయాల్ వేసిన మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లు కొట్టి దూకుడు మొదలుపెట్టిన అతను..మిగతా బౌలర్లపై కూడా ఎదురుదాడికి దిగాడు. అయితే, మరో ఎండ్‌లో అతనిలా దూకుడుగా ఆడే వారు కరువయ్యారు. మరో ఓపెనర్ కోహ్లెర్ కాడ్‌మోర్(20), కెప్టెన్ శాంసన్‌(17)‌ నిరాశపర్చినా.. వారితో కలిసి జైశ్వాల్ జట్టును మెరుగైన స్థితిలో నిలబెట్టాడు. అయితే, హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న జైశ్వాల్(45)ను గ్రీన్ అవుట్ చేయడంతో అతని దూకుడుకు బ్రేక్ పడింది. స్వల్ప వ్యవధిలోనే జైశ్వాల్, శాంసన్‌ వికెట్లతోపాటు ధ్రువ్ జురెల్(8) వికెట్ నష్టపోవడంతో రాజస్థాన్ తడబడింది. అనంతరం రియాన్ పరాగ్(36), హెట్మేయర్(26) ధాటిగా ఆడి జట్టును పోటీలోకి తెచ్చారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు విలువైన 45 పరుగులు జోడించి జట్టు విజయాన్ని తేలిక చేశారు. 18 బంతుల్లో లక్ష్యం 19 పరుగులుగా మారడంతో వీరిద్దరే మ్యాచ్‌ను ముగించేలా కనిపించారు. ఈ సమయంలో సిరాజ్ ఒకే ఓవర్‌లో రియాన్ పరాగ్, హెట్మేయర్‌లను పెవిలియన్ పంపి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. సిరాజ్ ఇచ్చిన అవకాశాన్ని ఆర్సీబీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 12 బంతుల్లో 13 రన్స్ అవసరమవ్వగా.. పావెల్(16 నాటౌట్) 19వ ఓవర్‌లో 4, 4, 6 కొట్టి రాజస్థాన్ విజయాన్ని లాంఛనం చేశాడు.

ఆర్సీబీ తడబాటు

కీలక పోరులో బ్యాటర్లు తడబడటం ఆ జట్టు కొంపముంచింది. మొదటి నుంచి బెంగళూరు ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఆ జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. రజత్ పటిదార్ చేసిన 34 పరుగులే టాప్ స్కోర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ తీరును అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ బౌలర్లు మొదటి నుంచే ఆర్సీబీని కట్టడి చేశారు. దీంతో ఆచితూచి ఆడిన ఓపెనర్ కోహ్లీ(33) జట్టుకు శుభారంభం అందించేందుకు ప్రయత్నించాడు. అయితే, మరో ఓపెనర్ డుప్లెసిస్(17) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 37 పరుగులకే బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే కోహ్లీ కూడా అవుటయ్యాడు. అనంతరం రజత్ పటిదార్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గ్రీన్‌తో కలిసి స్కోరు బోర్డును ట్రాక్ ఎక్కించాడు. 12 ఓవర్లలో 95/2 స్కోరుతో బెంగళూరు మెరుగైన స్థితిలోనే నిలిచింది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ ఆర్సీబీని కోలుకోకుండా చేశాడు. ఒకే ఓవర్‌లో గ్రీన్(27)తోపాటు మ్యాక్స్‌వెల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. అనంతరం రజత్ పటిదార్‌కు మహిపాల్ లోమ్రోర్ తోడయ్యాడు. రజత్ పటిదార్(34) అవుటైనా లోమ్రోర్(32) ధాటిగా ఆడటంతో స్కోరు 150 దాటింది. అయితే, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కార్తీక్(11) దారుణంగా నిరాశపర్చగా.. అదే ఓవర్‌లో లోమ్రోర్ కూడా వికెట్ పారేసుకున్నాడు. ఇక, చివరి ఓవర్‌లో కర్ణ్ శర్మ(5 నాటౌట్), స్వప్నిల్ సింగ్(9 నాటౌట్) 13 పరుగులు రాబట్టడంతో ఆర్సీబీ పోరాడే స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లతో సత్తాచాటారు. చాహల్‌కు ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ 172/8(20 ఓవర్లు)

కోహ్లీ(సి)ఫెరీరా(బి)చాహల్ 33, డుప్లెసిస్(సి)పావెల్(బి)బౌల్ట్ 17, గ్రీన్(సి) పావెల్(బి)అశ్విన్ 27, రజత్ పటిదార్(సి)రియాన్ పరాగ్(బి)అవేశ్ ఖాన్ 34, మ్యాక్స్‌వెల్(సి)ధ్రువ్ జురెల్(బి)అశ్విన్ 0, లోమ్రోర్(సి)పావెల్(బి)అవేశ్ ఖాన్ 32, కార్తీక్(సి)యశస్వి జైశ్వాల్(బి)అవేశ్ ఖాన్ 11, స్వప్నిల్ సింగ్ 9 నాటౌట్, కర్ణ్ శర్మ(సి)పావెల్(బి)సందీప్ 5; ఎక్స్‌ట్రాలు : 4.

వికెట్ల పతనం : 37-1, 56-2, 97-3, 97-4, 122-5, 154-6, 159-7, 172-8

బౌలింగ్ : బౌల్ట్(4-0-16-1), సందీప్ శర్మ(4-0-48-1), అవేశ్ ఖాన్(4-0-44-3), అశ్విన్(4-0-19-2), చాహల్(4-0-43-1)

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 174/6(19 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్(సి)కార్తీక్(బి)గ్రీన్ 45, కోహ్లెర్ కాడ్‌మోర్(బి)ఫెర్గూసన్ 20, శాంసన్(స్టంప్)కార్తీక్(బి)కర్ణ్ శర్మ 17, రియాన్ పరాగ్(బి)సిరాజ్ 36, ధ్రువ్ జురెల్ రనౌట్(కోహ్లీ/గ్రీన్) 8, హెట్మేయర్(సి)డుప్లెసిస్(బి)సిరాజ్ 26, పావెల్ 16 నాటౌట్, అశ్విన్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 6.

వికెట్ల పతనం : 46-1, 81-2, 86-3, 112-4, 157-5, 160-6

బౌలింగ్ : స్వప్నిల్ సింగ్(2-0-19-0), సిరాజ్(4-0-33-2), యశ్ దయాల్(3-0-37-0), ఫెర్గూసన్(4-0-37-1), కర్ణ్ శర్మ(2-0-19-1), గ్రీన్(4-0-28-1)

Next Story