సంచలన నిర్ణయం తీసుకున్న మ్యాక్స్‌వెల్

by Dishanational3 |
సంచలన నిర్ణయం తీసుకున్న మ్యాక్స్‌వెల్
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరోషాక్. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్-17 నుంచి నిరవధిక విరామం ప్రకటించాడు. అయితే, విరామం కాలాన్ని, తుది జట్టు ఎంపికకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనేది అతను చెప్పలేదు. హైదరాబాద్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా మంచి స్థితిలో లేనని, అందుకే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించకున్నట్టు తెలిపాడు.

‘పవర్ ప్లే తర్వాత మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. గత సీజన్లలో అదే నా బలం. కానీ, ఈ సారి బ్యాటుతో రాణించలేకపోతున్నా. అందుకే, డుప్లెసిస్, కోచ్‌ వద్దకు వెళ్లి నా స్థానంలో వేరేవారిని ప్రయత్నించే సమయం వచ్చిందని చెప్పాను. నాకు కూడా మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సమయం అని భావించా. ఆ స్థానంలో మరొకరు రాణిస్తారని ఆశిస్తున్నా. ఒకవేళ జట్టుకు నా అవసరం ఉంటే మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపేలా బలంగా తిరిగి వస్తా.’ అని చెప్పాడు.

కాగా, ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌ల్లో 32 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతను దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ స్థానంలో విల్ జాక్స్‌ తుది జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed