టీ20 ప్రపంచకప్‌లో ఆ రెండు జట్లే ఫేవరెట్ : గంగూలీ

by Dishanational3 |
టీ20 ప్రపంచకప్‌లో ఆ రెండు జట్లే ఫేవరెట్ : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తాయని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఇటీవలే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత జట్టుపై గంగూలీ స్పందిస్తూ..‘ఇది అద్భుతమైన జట్టు. జట్టు సభ్యులందరూ మ్యాచ్ విన్నర్లే. రోహిత్, ద్రవిడ్ బెస్ట్ టీమ్‌ను ఎంపిక చేశారు.’ అని చెప్పాడు. రింకూ సింగ్‌కు మెయిన్ స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడంపై గంగూలీ మాట్లాడుతూ.. అది టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాత్మక నిర్ణయమని చెప్పాడు.

‘వెస్టిండీస్‌లో పిచ్‌లు స్లోగా ఉంటాయి. స్పిన్‌కు సహకరించొచ్చు. అందుకే, సెలెక్టర్లు అదనపు స్పిన్నర్‌ను తీసుకున్నారు. అందుకే, రింకూకు అవకాశం రాలేదేమో. కానీ, రింకూ ఇది ఆరంభం మాత్రమే.’ అని తెలిపాడు. అలాగే, టీ20 వరల్డ్ కప్‌లో తన ఫేవరెట్ జట్లను దాదా వెల్లడించాడు. టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్లతో బరిలోకి దిగుతున్నాయని, ఆ రెండు జట్లు కచ్చితంగా సత్తాచాటుతాయని చెప్పాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ప్రపంచకప్ మొదలుకానుంది.

Next Story