యూపీలో విషాదం: బాంబు పేలి నలుగురు విద్యార్థులు మృతి

by Dishanational2 |
యూపీలో విషాదం: బాంబు పేలి నలుగురు విద్యార్థులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. చిత్రకూట్‌ జిల్లాలోని ఓ కళాశాలలో బుందేల్ ఖండ్‌ గౌరవ్ మహోత్సవ్ సందర్భంగా జరిగిన పేలుడులో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఉత్సవం సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో పేలుడు సంభవించినట్టు వెల్లడించారు. పేలుళ్ల శబ్దం సుమారు 2కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరణించిన విద్యార్థులను ప్రభాత్, యశ్, పరాస్, మోహిత్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు అడిషనల్ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ భాస్కర్‌ తెలిపారు. బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌గా పిలువబడే రెండు రోజుల సాంస్కృతిక ఉత్సవాన్ని చిత్రకూట్ ఇంటర్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సజావుగా సాగినా రెండో రోజు ఈ ఘటన జరగడం గమనార్హం.

బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం యోగీ ఆదిత్యనాథ్

చిత్రకూట్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. విద్యార్థులు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనిపై విచారణకు ఏడీజీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.50ల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దీనిని తక్షణమే అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందిస్తామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంతాపం తెలిపారు.



Next Story

Most Viewed