బీఆర్ఎస్ నేత సోదరులపై పోలీస్ కేసులు

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ నేత సోదరులపై పోలీస్ కేసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భూ వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి సోదరులతో పాటు, మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డిల అనుచరులపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కోకాపేట సర్వే నెంబర్ 85లో గోకుల్ అనే వ్యక్తి ప్రాజెక్ట్ పనులు చేస్తున్నాడు. కాగా, మంగళవారం సాయంత్రం 5.40 గంటల సమయంలో చల్లా వెంకట్రామి రెడ్డి, భీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు దీక్షాంత్ రెడ్డి, వికాస్‌లతోపాటు దాదాపు 50మంది దౌర్జన్యంగా సైట్‌లోకి ప్రవేశించారు. అక్కడ పని చేస్తున్న వారిపై చెయ్యి చేసుకోవటంతోపాటు అందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి చల్లా వెంకట్రామి రెడ్డి కజిన్ అశ్వంత్ రెడ్డి, మరో సోదరుడు అగస్త్య రెడ్డి అక్కడికి వచ్చి తమ అనుచరులతో కలిసి గోకుల్ తదితరులను బెదిరించారు. విషయం తెలిసి గోకుల్ అక్కడకు వెళ్లగా దీక్షాంత్ రెడ్డి అతనిపై చెయ్యి చేసుకోవటంతో పాటు చంపేస్తా అంటూ బెదిరించాడు. అనుచరులు అక్కడ ఉన్న జేసీబీని ధ్వంసం చేశారు. ఈ మేరకు గోకుల్ ఫిర్యాదు చెయ్యగా నార్సింగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 447,427,506 రెడ్ విత్ 34 ప్రకారం అశ్వంత్ రెడ్డి, ఆగస్త్య రెడ్డి తదితరులపై కేసులు నమోదు చేశారు.



Next Story