ఆర్మూర్‌లో ‘రియల్‌’ వ్యాపారుల హల్‌చల్.. ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జాకు యత్నం!

by Disha Web Desk 2 |
ఆర్మూర్‌లో ‘రియల్‌’ వ్యాపారుల హల్‌చల్.. ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జాకు యత్నం!
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని కోటార్మూర్ గ్రామంలో 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన గట్టడి గుండు గంగాధర్, నవనీత్ రాజ్, చౌటి గిరిధర్‌ అనే ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి కొనుగోలు చేశారు. 2007లో అదే గ్రామానికి చెందిన రియల్ వ్యాపారి ప్రొద్దుటూరి నరసింహారెడ్డి వద్ద 40-3,40-4 సర్వే నంబర్లలోని 25 గుంటల నర భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిలో రెండు రోడ్లకు స్థలం పోగా.. మిగిలిన భూమి కంటే అదనంగా ఇతరులకు విక్రయించారు. అంతేకాదు.. గతంలో గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం ఉంచిన భూమిని అమ్ముకునేందుకు సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారురి కుయుక్తులు పన్నుతున్నాడు. ఆ సర్వే నంబర్ల మధ్యలో ఉన్న నిజాంసాగర్ కెనాల్ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి కొనుగోలు చేసిన భూమి కంటే అదనంగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ కబ్జాలు, అమ్మకాలు జరుపుతున్న రియల్ వ్యాపారులకు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు సపోర్ట్ ఉన్నట్లు సమాచారం.

బోరు బావి స్థలం కబ్జాపై మున్సిపాలిటీకి ఫిర్యాదు:

కోటార్మూర్ గ్రామంలో గతంలో గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం వదిలిన స్థలాన్ని, బోరుబావిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సంఘటనను ఆధారాలు, ఫొటోలతో సహా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్‌కు, కొటార్మూర్‌లోని మహాలక్ష్మి కాలనీవాసులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో రాత్రికి రాత్రే ఆ స్థలంలో బోరుబావిని తీయించి మున్సిపల్ కమిషనర్‌ను మహాలక్ష్మి కాలనీ వాసులు నిలదీశారు. అనంతరం దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆ స్థలాన్ని కబ్జా కాకుండా చూస్తామని, మున్సిపల్ సిబ్బందిని అక్కడికి పంపి ఆ రియల్ వ్యాపారులు కబ్జా చేసేందుకు పెడుతున్న రెడీమేడ్ ప్రహరీ పనులను నిలిపివేయించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. సదరు రియల్ వ్యాపారి మాత్రం రాత్రికి రాత్రే ఆ స్థలంలో రెడీమేడ్ ప్రహరీ గోడను చకచకా నిర్మాణం చేయించుకున్నాడు. దీనిపై మున్సిపల్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారోనని గ్రామంలో చర్చ జరుగుతోంది.


Next Story