మొత్తం డేటా డిలీట్ చేసిన ప్రణీత్​రావు.. క్రిమినల్ చర్యలకు సిద్ధమైన అధికారులు!

by Disha Web Desk 2 |
మొత్తం డేటా డిలీట్ చేసిన ప్రణీత్​రావు.. క్రిమినల్ చర్యలకు సిద్ధమైన అధికారులు!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్​ట్యాపింగ్​వ్యవహారంలో సస్పెండ్​అయిన డీఎస్పీ ప్రణీత్​రావుపై క్రిమినల్​చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్​ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్​చేయించినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితోపాటు బీజేపీ అగ్రనాయకుల్లో ఒకరైన బండి సంజయ్​పలుమార్లు ఫోన్​ట్యాపింగులపై అప్పటి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. తాజాగా ఇదే వ్యవహారంలో ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్​రావును సస్పెండ్​చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్వోటీ ఇన్‌ఛార్జ్‌గా..

బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ప్రణీత్​రావు ఎస్ఐబీలో ఎస్వోటీ టీం ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ప్రణీత్​రావు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాప్​చేశారు. కాగా, ప్రభుత్వం మారగానే ఆయనను రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీకి బదిలీపై చేశారు. అయితే, ఈ మధ్యకాలంలోనే ఎస్ఐబీ ఆఫీస్‌లోని సీసీ కెమెరాలను ఎలక్ట్రీషియన్ సహాయంతో ఆఫ్ చేయించి ప్రణీత్​రావు పలు కీలక రికార్డులను మాయం చేసినట్టు తెలిసింది. దాంతో పాటు 42 హార్డ్ డిస్కుల్లో కొన్నింటిని రిమూవ్​చేయటంతోపాటు మరికొన్నింటిని రిప్లేస్​చేశారు. ఎస్ఓటీ లాగర్​రూంలో ఉన్న కీలకమైన సీడీఆర్​వివరాలు, ఐఎంఈఐ నెంబర్లు, ఐపీడీఆర్ డేటాను పూర్తిగా చెరిపివేశారు. నేరపూరిత ఉద్దేశ్యంతోనే ప్రణీత్​రావు ఇదంతా చేశారని నిశ్చయించుకున్న ఉన్నతాధికారులు అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్​చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల డీఎస్ఆర్బీలో ఉన్న ప్రణీత్​రావును ఉన్నతాధికారుల అనుమతి లేకుండా జిల్లా విడిచి బయటకు వెళ్ల వద్దని ఆదేశించారు.



Next Story