బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు కార్మికులు మృతి

by Dishanational2 |
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు కార్మికులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంభి జిల్లా భర్వారీ ప్రాంతంలోని ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం పేలుళ్లు జరగగా ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరికొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 24 మంది కార్మికులు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా.. పెద్ద శబ్దంతో పేలుళ్లు సంభవించి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు కౌశాంభి ఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ నివాస ప్రాంతానికి దూరంలో ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఫ్యాక్టరీ యజమాని సైతం మరణించినట్టు తెలుస్తోంది. కాగా, శనివారం ట్రాక్టర్ బోల్తాపడి మహిళలు, పిల్లలతో సహా సుమారు 20మంది మృతి చెందిన ఘటన మరువక ముందే తాజాగా.. అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించడంతో యూపీలో విషాద చాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed