గర్భగుడిలో కొలువుతీరిన అయోధ్య రామ్‌లల్లా

by Dishanational4 |
గర్భగుడిలో కొలువుతీరిన అయోధ్య రామ్‌లల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం గర్భగుడిలోని పీఠంపై రామ్‌లల్లా కొలువుతీరాడు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 4 గంటల పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. పూజల్లో శిల్పి అరుణ్ యోగిరాజ్, పలువురు సాధువులు పాల్గొన్నారు. ఐదేళ్ల శ్రీరాముడిని తలపించే 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని శాస్త్రోక్తమైన పూజలతో పీఠంపై ప్రతిష్ఠించారు. ప్రస్తుతం రామ్ లల్లా విగ్రహాన్ని తెరతో కప్పి ఉంచారని, విగ్రహం కళ్లకు వస్త్రం కట్టారని తెలుస్తోంది. గర్భగుడి ప్రదేశంలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం సిబ్బందిని మోహరించారు. గర్భగుడి వద్దకు మొబైల్ ఫోన్‌తో వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరిగే వరకు గర్భగుడిలో రామయ్యకు ప్రతిరోజూ ఐదుసార్లు ప్రత్యేక హారతి ఇవ్వనున్నారు. ఈక్రమంలో రోజూ ఒక్కో రకమైన పవిత్ర వస్త్రాలలో రామ్‌లల్లాను ఆరాధిస్తారు. ఈ పూజలు, క్రతువులను 121 మంది ఆచార్యులు నిర్వహిస్తారు. భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరిగిన తర్వాతి నుంచి రామానంది సంప్రదాయంలో ఆలయంలో పూజలను నిర్వహిస్తారు.

Next Story

Most Viewed