రామమందిరాన్ని రాజకీయ కోణంతో చూడొద్దు: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే

by Dishanational2 |
రామమందిరాన్ని రాజకీయ కోణంతో చూడొద్దు: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని శ్రీ శృంగేరి శారదా పీఠం, గుజరాత్‌లోని ద్వారకా శారదా పీఠం, ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్ పీఠం, ఒడిశాలోని గోవర్ధన్ పీఠ్‌లకు చెందిన శంకరాచార్యులు రామమందిర విగ్రహ ప్రతిష్టాపనకు హాజరుకావడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే విమర్శలు గుప్పించారు. శంకరాచార్యులు రామమందిరాన్ని ఆశీర్వదించాలని.. కానీ విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. శంకరాచార్యులు ప్రధాని మోడీ, బీజేపీని రాజకీయ కోణంతో చూస్తున్నారని ఆరోపించారు. రామమందిరం రాజకీయాల ఆధారంగా కాకుండా మత విశ్వాసాల మీద నిర్మించారని.. రాముడు ఎప్పటికీ మా దేవుడే అని అన్నారు. శంకరాచార్యులు హిందూ మతానికి తమ సహకారం అందించాలని కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామమందిరాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేయడంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..ఉద్యోగం లేని, ఇంట్లో కూర్చున్న వ్యక్తి గురించి తాను మాట్లాడబోనని చెప్పారు. థాక్రే వర్గం మరింత దెబ్బతింటుందన్నారు. థాక్రే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది బీజేపీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మరోవైపు, నారాయణ్ రాణే వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే స్పందించారు. రాణే హిందూ మతాన్ని, దాని ఆధ్యాత్మిక అధిపతులను అవమానించారని విమర్శించారు. ఆయనకు హిందూ మతం గురించి సరిగా తెలియదని చెప్పారు.


Next Story

Most Viewed