తెలంగాణలో మరో 99 కేసులు.. నలుగురి మృతి

by  |
తెలంగాణలో మరో 99 కేసులు.. నలుగురి మృతి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ రాష్ట్రంలో పంజాను విసురుతోంది. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలోని సుమారు 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. వారితో పాటు ఏడుగురు జర్నలిస్టులకు కూడా కరోనా సోకడంతో పరిస్థితి ఆందోళకరంగా ఉంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది జూనియర్ డాక్టర్లకు మాత్రమే కరోనా వచ్చినట్టు అధికారికంగా ధృవీకరించారు. ఎక్కువ మందికి వైరస్ వచ్చినట్టు బయటకు చెబితే వైద్యుల్లో, వారి కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రికి వచ్చే ప్రజల్లో ఆందోళన పెరిగి అవకాశం ఉండటంతో దాచిపెడుతున్నట్టు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రిని కోవిడ్ వైద్య సేవలకు పరిమితం చేసినప్పటి నుంచి ఇతర వ్యాధులకు చికిత్సనందించడంలో ఉస్మానియా పెద్దదిక్కుగా మారింది. కరోనా ఆస్పత్రి కాకపోవడంతో ఉస్మానియాలో పనిచేసే వైద్యులకు పీపీఈ కిట్లు అందించలేదు. దీంతో తమకు కరోనా సోకిందని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో భౌతిక దూరం పాటించడం కూడా సాధ్యం కావడం లేదని.. వైద్యులందరికీ ఎన్-95 మాస్క్‌లు అందించాలని జుడాల యూనియన్ నాయకుడు జి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరోనా వారియర్స్‌ అంటూ అభినందనలు అందుకున్న వైద్యుల్లోనే కరోనా కేసులు నమోదవుతుండటంతో సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి కేంద్రంగా ప్రైమరీ కాంటాక్ట్ కేసులు పెరిగినట్టు ఇటీవలే అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ పరిధిలోని పెద్దాస్పత్రిలోని వైద్యులకు పదుల సంఖ్యలో కరోనా సోకడం ఇదే ప్రథమం. గతంలోనూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని వైద్య దంపతులకు కరోనా వచ్చిందన్న వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నఓ ఇంగ్లీష్ ఛానెల్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంతకుముందు నేషనల్ ఛానెల్స్‌లో పనిచేస్తున్న నలుగురు మీడీయా వ్యక్తులకు కూడా కరోనా సోకింది. ఈ నేపథ్యంలో మీడీయా వర్గాలతో పాటు అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మరణించారని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,891కి చేరుకోగా.. 92 కరోనా మరణాలు సంభవించాయని హెల్త్ బులిటెన్‌ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ 70, రంగారెడ్డిలో 7, మేడ్చల్‌లో మూడు, నల్గొండలో రెండు, మహబూబ్‌‌నగర్‌, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వలస కార్మికుల్లో 12 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నమోదయ్యింది. దీంతో వలస ప్రజల్లో కేసుల సంఖ్య 446కు చేరుకున్నాయి. రాష్ట్రంలో చికిత్స తీసుకుంటున్న వారు 1,273 మంది ఉండగా.. 1,526 మంది డిశ్చార్జి అయి ఇండ్లకు వెళ్లారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 27 మంది కరోనా అనుమానితులు చేరారు. వీరిలో 16 మంది పోలీసు విభాగానికి చెందిన వారే ఉన్నారు.

Next Story