9 రాష్ట్రాల్లో వన్ నేషన్, వన్ రేషన్: కేంద్ర ఆర్థిక శాఖ

by  |
9 రాష్ట్రాల్లో వన్ నేషన్, వన్ రేషన్: కేంద్ర ఆర్థిక శాఖ
X

న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలు వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు సంస్కరణను అమలు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితంగా రూ. 23523 కోట్లు అదనంగా రుణాలు తీసుకోవడానికి వీటిని అవకాశం కల్పించినట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లు ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణలను అమలు చేశాయని వివరించింది. రూ. 4851 కోట్లతో యూపీ అతిపెద్ద లబ్దిదారుగా ఉందని, తర్వాతి స్థానాల్లో కర్ణాటక, గుజరాత్‌లున్నట్టు పేర్కొంది. అదనపు రుణాలు పొందగోరే రాష్ట్రాలు ఈ నెల 31వ తేదీలోపు సంస్కరణలు అమలు చేయాలని సూచించింది.

కరోనా కష్టకాలంలో రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాల జీఎస్‌డీపీలో రెండు శాతం అదనపు రుణాలను గ్రాంట్ల కింద 2020-21 ఏడాదిలో తీసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ అనుమతిని పౌరులకు అత్యవసరమైన కొన్ని సంస్కరణలతో ముడిపెట్టింది. ఇందులో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు కోసం 0.25శాతాన్ని కేటాయించింది.

ఉపాధి వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటే వలస కార్మికులు, వారి కుటుంబాలు సులువుగా రేషన్ సరుకులు పొందడానికి వన్ నేషన్.. వన్ రేషన్ పథకం ఉపయోగపడుతుంది. వాస్తవ లబ్దిదారులను గుర్తించడం, బోగస్ కార్డులను ఏరివేయడానికి ఇది ఉపకరించనుంది. అందుకే ఆధార్ అనుసంధానం, బయోమెట్రిక్ ధ్రువీకరణ, ఇతర కండీషన్లను సర్కారు తప్పనిసరిగా పెట్టింది.

Next Story

Most Viewed