ఆర్టీసీ ఆగమాగం.. ఏడేండ్లుగా ఖాళీలే..

by  |
Bus
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ విఫలమవుతున్నాయి. ఉద్యోగాల భర్తీ అటకెక్కింది. వేల మంది పదవీ విరమణ చేస్తున్నా… ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయడం లేదు. ఫలితంగా కార్మికులపై పనిభారం పెరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీని నిర్లక్ష్యం చేస్తుందనడంలో ఇదే ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటికే వేతనాల పెంపుపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. 2017, 2021 రెండు వేతన సవరణలకు దిక్కులేదు. కనీసం కొత్త నియామకాల ప్రక్రియను చేస్తారని ఆశిస్తున్నా… అతిగతీ లేకుండా పోతోంది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

8 వేల మంది రిటైర్మెంట్​

తెలంగాణ ఆర్టీసీలో మొత్తం 8 వేల మంది కార్మికులు పదవీ విరమణ చేశారు. 2014 నుంచి 2021 వరకు వీరంతా రిటైరయ్యారు. అయితే 2018లో మాత్రం ఆర్టీసీ యాజమాన్యం 31 మంది జూనియర్​ అసిస్టెంట్ల నియామకానికి అనుమతి తెలిపింది. టీఎస్​పీఎస్సీ నుంచి నోటిఫికేషన్​ జారీ చేశారు. కానీ కారణాలేమైనా అది పెండింగ్​ పడింది. ఆ తర్వాత ఒక్క పోస్టు కూడా రిక్రూట్​మెంట్​ చేయలేదు. ప్రతినెలా కార్మికులు రిటైర్​ అవుతున్నా భర్తీ చేయడం లేదు. ఉన్న వారితోనే విధులను సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ఒక్కొ కార్మికుడిపై పనిభారం పెరుగుతూ వస్తోంది.

గ్యారేజ్​ కార్మికులకు మరింత కష్టం

ఆర్టీసీలోని గ్యారేజీల్లో కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వాస్తవంగా చాలా బస్సులు ఏండ్ల తరబడి నడుపుతున్నారు. దీంతో రోజువారీగా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. కొన్ని బస్సులకు రిపేర్లు చేయలేక పక్కన పెట్టారు. దీంతో వాటిని స్పేర్​పార్ట్స్​గా వినియోగించుకునే పరిస్థితి ఏర్పడింది. అధికారులు కొత్త స్పేర్​పార్ట్స్​ తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. దీనికితోడుగా సగం మంది మెకానిక్​లతోనే వెళ్లదీస్తున్నారు. మెకానిక్​లకు గతంలో అసిస్టెంట్స్​ ఉండగా… ఇప్పుడు మొత్తానికి తొలగించారు. కొత్త పోస్టులను భర్తీ చేయకపోవడంతో జూనియర్​మెకానిక్​లు రావడం లేదు. ఇక బస్సులను తప్పనిసరి తిప్పాల్సి రావడం, బస్సుల బాధ్యత మొత్తం వారిపైనే పెడుతుండటంతో ఒక బస్సు స్పేర్​పార్ట్​లను తీసి ఇంకో బస్సుకు వేయడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.

భర్తీ ఎలా ..?

ఆర్టీసీ సమ్మె అనంతరం సీఎం కేసీఆర్​ కార్మికులకు వరాలు కురిపించారు. దానిలో భాగంగా కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో ఆర్టీసీలు కార్మికులపై పనిభారం తగ్గుతుందని ఆశపడ్డారు. కానీ అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా రిక్రూట్​మెంట్​ చేయలేదు. అప్రెంటీస్​ నోటిఫికేషన్​ కూడా ఇవ్వడం లేదు. ఇటీవల రంగారెడ్డిలో 33 పోస్టులకు నోటిఫికేషన్​ ఇచ్చినా… ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే రిటైర్మెంట్​ అవుతున్న వారికి బెనిఫిట్స్​ ఇచ్చేందుకే ఆర్టీసీ సవాలక్ష కారణాలను చూపిస్తోంది. దాదాపు మూడేండ్ల నుంచి రిటైర్మెంట్స్​ బెనిఫిట్స్​ పెండింగ్​లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకునేందుకు అవకాశమే లేదని ఆర్టీసీ అధికారులు చెప్పుతున్నారు.

కార్మిక సంఘాల ఆగ్రహం

అయితే కార్మిక సంఘాలు మాత్రం దీనిపై మండిపడుతున్నాయి. ఇంకా ఎంత కాలం పనిభారం మోపుతారంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకుండానే వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీని మాత్రం వ్యూహం ప్రకారమే నిర్లక్ష్యం చేస్తుందని మండిపడుతున్నారు. కొత్తగా నియామకం చేయకుండా వ్యవహరించడంలో అంతర్యముందని ఆరోపిస్తున్నారు.

వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలి

ఆర్టీసీలో రిటైర్మెంట్​ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవాలి. ఏడేండ్ల నుంచి ఒక్క పోస్టును కూడా భర్తీ చేయడం లేదు. దీంతో కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారు. పనిభారంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలి. దీనిపై త్వరలోనే అధికారులను కలిసి విన్నవిస్తాం.
– రాజిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి


Next Story