జమ్మూలో మరో ‘పుల్వామా’ ప్లాన్.. అప్రమత్తమైన ఆర్మీ

by  |
జమ్మూలో మరో ‘పుల్వామా’ ప్లాన్.. అప్రమత్తమైన ఆర్మీ
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన దాడికి రెండేళ్లు నిండిన రోజే మరో ఉగ్రకుట్రకు టెర్రరిస్టులు ప్లాన్ వేశారు. కానీ, సకాలంలో పోలీసులు రంగంలోకి దిగి ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులు సుహేల్, ఖాజీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడు కిలోల పేలుడు పదార్థాలను స్వాదీనం చేసుకున్నట్టు జమ్ము కశ్మీర్ ఐజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. పుల్వామా దాడి జరిగి రెండేళ్లు గడిచిన రోజే మరో ఉగ్రదాడికి టెర్రరిస్టులు ప్రణాళికలు వేస్తున్నట్టు మూడు రోజుల కిందే తమకు సమాచారం అందిందని, అందుకు అనుగుణంగానే తాము అప్రమత్తమయ్యామని వివరించారు. ఛండీగడ్‌లో నర్సింగ్ చదువుతున్న పుల్వామాకు చెందిన సుహేల్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆరున్నర కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన అల్ బదర్ తంజీమ్ ఇక్కడ ఐఈడీ పేలుడు పదార్థాలను అమర్చాలని సూచనలిచ్చినట్టు దర్యాప్తులో వెల్లడించారని వివరించారు. మరో వ్యక్తి ఖాజీని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రఘునాథ్ టెంపుల్, లాఖ్‌దత్తా బజార్, జమ్ము రైల్వే స్టేషన్‌లు ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్నట్టు తెలిపారు. అలాగే, సాంబా జిల్లాలో 15 చిన్న ఐఈడీలు, ఆరు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇవి డ్రోన్ ద్వారా ఇక్కడకు చేరవేసినట్టు తెలుస్తున్నదని అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed