వడ్డీపై వడ్డీ మాఫీ వల్ల 75 శాతం మంది రుణగ్రహీతలకు లబ్ది

by  |
వడ్డీపై వడ్డీ మాఫీ వల్ల 75 శాతం మంది రుణగ్రహీతలకు లబ్ది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ప్రకటించిన వడ్డీపై వడ్డీ మాఫీతో సుమారు 75 శాతం రుణగ్రహీతలు లబ్ది పొందే అవకాశముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం తెలిపింది. ఈ మాఫీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 7,500 కోట్లు ఖర్చవుతాయని క్రిసిల్ అభిప్రాయపడింది. మారటోరియం పొందారా లేదా అనేదానితో సంబంధం లేకుండా రూ. 2 కోట్ల కంటే తక్కువ రుణాలను పొందిన రుణగ్రహీతలకు ఈ ప్రయోజనాలు వర్తించనుంది.

సమర్థవంతంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ నవంబర్ 5 నాటికి అర్హత ఉన్న రుణగ్రహీతలకు ఆ మొత్తాన్ని క్రెడిట్ చేయాలని ప్రభుత్వం బ్యాంకులను కోరిన సంగతి తెలిసిందే. క్రిసిల్ పరిశోధన ప్రకారం.. రూ. 2 కోట్ల వరకు అర్హత కలిగిన రుణగ్రహీతలకు పూర్తి వడ్డీ మినహాయింపు ఇవ్వగలిగితే ప్రభుత్వానికి రూ. 1.5 లక్షల కోట్ల భారం ఉంటుంది. ఇది ప్రభుత్వంతో పాటు ఆర్థిక రంగానికి కూడా కొత్త సవాళ్లను తెచ్చిపెడుతుంది. వడ్డీపై వడ్డీని మాత్రమే మాఫీ చేయడం వల్ల ప్రభుత్వానికి తక్కువ ప్రభావం ఉంటుందని’ క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు.



Next Story

Most Viewed