ఉద్యోగులపై అమెజాన్ ఇండియా సర్వే.. ఏం చెప్తోందంటే ?

by  |
business
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని పలు రంగాల్లోని నిపుణులు తమ కెరీర్ మార్గాలను మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు ఓ నివేదికలో తేలింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం.. కొవిడ్ మహమ్మారి కారణంగా చాలామంది కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారని, 68 శాతం మంది ఉద్యోగులు ఇప్పుడున్న వాటిని వీడి కొత్త పరిశ్రమలవైపు వెళ్లాలని చూస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.

అమెజాన్ సంస్థ భారత్‌లోని నిపుణుల నుంచి ‘ఉద్యోగులు, భవిష్యత్తు కెరీర్ ప్రణాళికలపై కొవిడ్ ప్రభావం’ గురించి అంచనా వేసేందుకు ఈ సర్వే జరిపింది. ఈ ప్రక్రియను మార్నింగ్ కన్సల్ట్ అనే గ్లోబల్ డేటా ఇంటిలిజెన్స్ సంస్థ నిర్వహించింది. ఇందులో 59 శాతం మంది నిపుణులు ఉద్యోగాల వేటలో ఉన్నారని తేలగా, 90 శాతం మంది కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని భావిస్తున్నారు. కరోనా వల్ల 35 శాతం మంది వేతన తగ్గింపుతో ఇబ్బంది పడ్డారని, 68 శాతానికి పైగా ఉద్యోగులు కరోనా ప్రభావంతో ఇప్పుడున్న పరిశ్రమలను కాకుండా కొత్త వాటికి మారాలని చూస్తున్నట్టు చెప్పారు.

అలాగే, 51 శాతం మంది తమకు ఇప్పటివరకు అనుభవంలేని కొత్త పరిశ్రమలకు మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న వారిలో 75 శాతం మంది తమకున్న స్కిల్స్ ఐదేళ్ల తర్వాత చెల్లవని ఆందోళన పడుతున్నారు. ఈ నివేదిక కొవిడ్ మహమ్మారి పరిస్థితులకు అద్దం పడుతుందని అమెజాన్ అభిప్రాయపడింది. కాగా, 2025 నాటికి భారత్‌లో 20 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను అందించనున్నట్టు అమెజాన్ తెలిపింది. ఇటీవల దేశీయంగా 35 నగరాల్లో 8,000 ప్రత్యక్ష ఉద్యోగావకాశాలను ప్రకటించినట్టు వెల్లడించింది. అమెజాన్ సంస్థ ఈ నెల 16న భారత్‌లో మొట్టమొదటిసారిగా కెరీర్ డే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.


Next Story

Most Viewed