ఫిజికల్ క్లాసులు.. 60 శాతం మంది ఓకే చెప్పారు

by  |
ఫిజికల్ క్లాసులు.. 60 శాతం మంది ఓకే చెప్పారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తరగతి గదిలో క్లాసుల నిర్వహణకు రాష్ట్రంలో 60శాతం మంది విద్యార్థుల పేరెంట్స్ అంగీకరించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్నందున డీఈఓ, ఇంటర్మీడియల్ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం వేర్వేరుగా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల కార్మికులు స్కూళ్లను శుభ్రం చేసే బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు.

విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలన్న నిబంధనలు లేవని, తల్లిదండ్రులు పర్మిషన్ ఉంటేనే స్కూళ్లకు అనుమతిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 14,252 స్కూల్స్‌కు లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండటంతో కొవిడ్ మార్గనిర్దేశకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్నామన్నారు. సుమారు 85 శాతం స్కూళ్లు సందర్శించి వాటిని ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారన్న భరోసాను కల్పించడమే బాధ్యతని డీఈఓలకు సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలోనూ కొవిడ్ నిబంధనలు అమలు చేయాల్సిందేనన్నారు. విద్యాసంస్థల నిర్వాహణ జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీలదేనని స్పష్టం చేశారు.

ప్రతి విద్యార్థికీ థర్మల్ స్క్రీనింగ్

స్కూళ్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పాఠశాలల్లో కమిటీలు వేశామని, పాఠశాలల్లో, హాస్టళ్లల్లో కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మధ్యాహ్న భోజనం, మెడికల్, శానిటేషన్ ప్లానింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఆయా కమిటీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా బియ్యం, ఆహార పదార్థాలన్నీ కొత్తవి మాత్రమే వినియోగించాలని సూచించారు. పాఠశాలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థికీ థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నట్టు తెలిపారు. తరగతి గదులను నిరంతంర శానిటైజ్ చేయాలని సూచించారు.

మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 70 శాతం సిలబస్ పూర్తయిందని, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు మిగిలిన సిలబస్‌పై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ప్రతి విద్యార్థికీ కొత్త యూనిఫాంలు సైతం అందిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో శానిటైజేషన్ బాధ్యతను స్థానిక సంస్థలే చూసుకుంటాయని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు మిషన్ భగీరథ నీటిని అందించనున్నట్టు మంత్రి వివరించారు. సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలని కోరుతున్న ఉపాధ్యాయుల డిమాండ్‌కు మోక్షం కలగలేదు.

ఇంటర్‌లో ప్రతి రోజూ ప్రాక్టికల్స్

ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల వారీగా ప్రణాళికలు రూపొందించి కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని జిల్లా ఇంటర్మీయట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సూచించారు. ఇంటర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులతో పాటే ప్రతిరోజూ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్షలను మే 15లోపు పూర్తి చేస్తామని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వారం రోజుల్లో వెల్లడిస్తామన్నారు. ప్రతీ కళాశాలలోనూ ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, శ్రీదేవసేన, ఉమర్ జలీల్ పాల్గొన్నారు.


Next Story