‘అన్నపూర్ణ’కు ఆరేండ్లు

by  |
‘అన్నపూర్ణ’కు ఆరేండ్లు
X

దిశ, న్యూస్​ బ్యూరో: పేదలకు అందుబాటు ధరలో భోజనం అందించేందుకు గ్రేటర్​ హైదరాబాద్​లో తీసుకొచ్చిన ‘అన్నపూర్ణ పథకానికి’ నేటితో (2020 మార్చి1) ఆరేండ్లు పూర్తయ్యాయి. రూ.5ల భోజనంగా ప్రచారంలో ఉన్న ఈ పథకం ఎంతో మంది ఆకలి తీరుస్తోంది. ముఖ్యంగా లైబ్రరీల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు, దినసరి కూలీలు, ఆటోవాలాలతో పాటు వివిధ పనుల కోసం సిటీకి వచ్చే వారికి ఆకలి తీరుస్తూ ‘అన్నపూర్ణ’ పేరును నిలబెట్టుకుంటోంది.

కేవలం 8 సెంటర్లతో మొదలైన ఈ పథకం.. 2014 మార్చి 1న నాంపల్లిలోని సరాయ్​లో తొలి అన్నపూర్ణ సెంటర్​‌ను ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం వీటి సంఖ్య 150కి చేరుకుంది. ఒక్కో సెంటర్‌లో సామర్థ్యాన్ని బట్టి ప్రతిరోజు 120 నుంచి 540 మంది వరకూ ఆకలి తీర్చుకుంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా చూసుకుంటే రోజూ సుమారు 30 నుంచి 35వేల మంది వరకు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నట్టు అంచనా. ఈ ఆరేండ్లలో నాలుగు కోట్ల మంది ఆకలిని ‘అన్నపూర్ణ’ తీర్చింది. సుమారు తొమ్మిది రకాల ఐటమ్స్​తో రుచికరమైన భోజనాన్ని అందించేందుకు జీహెచ్​ఎంసీ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఒక భోజనం విలువ సుమారు రూ.24.25 పడుతుండగా, జీహెచ్​ఎంసీ రూ.19.25 చెల్లిస్తుండగా.. రూ.5 వినియోగదారుడు చెల్లించాలి. భోజనం అందించే ఏజెన్సీగా హరే రామ – హరే కృష్ణ ఫౌండేషన్​ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ‘మొబైల్​ అన్నపూర్ణ స్కీం’ను కూడా ప్రారంభించేందుకు జీహెచ్​ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఓయూ క్యాంపస్​, సెంట్రల్​ లైబ్రరీ, బస్టాండ్​ల వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్లతో వేలమంది విద్యార్థులు, సాధారణ ప్రజలు మధ్యాహ్నం ఆకలి తీర్చుకుంటున్నారు.
అన్నపూర్ణ భోజనం మంచి ఫలితాలను ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే, క్యాంటీన్ల పక్కన అపరిశుభ్ర వాతావరణం భోజన సమయంలో ఇబ్బంది కలిగిస్తోంది. తాగునీరు లేకపోవడం, నిల్చునే తినాల్సి రావడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇందుకోసం పక్కా భవనాలు నిర్మించాలన్న ఆలోచనలు కూడా బల్దియా చేస్తోంది. ఈ వసతులు కల్పిస్తే అన్నపూర్ణ క్యాంటీన్లకు మరింత స్పందన పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అమీర్​పేటలో వేడుకలు..

అమీర్‌పేట సత్యం థియేటర్ ముందు నెలకొల్పిన కేంద్రంలో అన్నపూర్ణ ఆరేండ్ల వేడుకలను రేపు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొననున్నారు.

Next Story

Most Viewed