ఆ ప్రదేశంలో 59మంది టీనేజర్ల శవాలు!

by  |
ఆ ప్రదేశంలో 59మంది టీనేజర్ల శవాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికో దేశంలో అత్యంత దారుణం వెలుగుచూసింది. గువానజువాటో అనే ప్రాంతంలో ఉన్న సమాధుల మధ్యలో 59 మృతదేహాలను అధికారులు గుర్తించారు. అందులో 10కి పైగా మృతదేహాలు అమ్మాయిలవి కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. డెడ్ బాడీలు లభించిన చోటు సాల్వటియెర్ర మున్సిపాలిటీ ప్రాంతం కిందకు వస్తుంది.దీనిని మెక్సికోలోనే అత్యంత హింసాత్మక ప్రాంతాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలోని మాదకద్రవ్యాల వ్యాపారులు.. డ్రగ్స్ అక్రమ రవాణాదారుల కోసం తరచూ వివాదాల్లోకి దిగుతుంటారు. ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే ఇక్కడ 2,200 హత్యలు నమోదైనట్లు అధికారికంగా నిర్దారించారు.

అయితే, తప్పిపోయిన కొందరు వ్యక్తుల గురించి వారి కుటుంబ సభ్యులు నుంచి ఫిర్యాదులు రాగా, అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సమాధుల మధ్యలో ఒకే చోట 59 మృతదేహాలు కనిపించినట్లు మెక్సికో నేషనల్ సెర్చ్ కమీషన్ అధికారి కార్ల కింటానా వెల్లడించారు. మృతుల్లో 10 మందికి పైగా అమ్మాయిలు కూడా ఉన్నారని వివరించారు. వీరిని కనిపెట్టడానికి కనీసం 80మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొనగా, మృతదేహాలను గుర్తించడానికి ముందు కనీసం 52 చోట్ల తవ్వకాలు జరిపినట్లు సెర్చ్ కమిషనర్ హెక్టర్ డియాజ్ చెప్పారు.

గువానజువాటో నేరస్థుల అడ్డా..

గువానజువాటో అనేది నేరస్థులకు పెట్టింది పేరు. జులై నెలలో ఇరపువాటోలో ఉండే ఒక మాదకద్రవ్యాల రీహాబిలిటేషన్ కేంద్రంలోకి ఆయుధాలు ధరించిన వ్యక్తులు చొరబడి 24 మందిని హతమార్చారు. అంతకుముందు నెలకిందట కూడా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుందని సమాచారం. అయితే, 2018 మెక్సికో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ ఈ గ్యాంగు హింసను నిర్మూలిస్తానని ప్రమాణం చేశారు. కానీ, దేశంలోనే అత్యధిక స్థాయిలో హత్యలు 2019లో నమోదవ్వడం అక్కడ హింస ఏ రేంజ్‌లో ఉందో అందరికి కళ్లకు కట్టినట్లు చూపించింది.

Next Story

Most Viewed